తిరుమలలో బాబు ఫ్యామిలీ… అది ట్రెడిషన్ గా మారిందా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం మొత్తాన్ని తీసుకుని శుక్రవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సన్నిధి తిరుమలకు చేరుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణీలతో కలిసి చంద్రబాబు తిరుమల లో స్వామి వారి సేవలో పాలుపంచుకున్నారు. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాబుకు ఘన స్వాగతం పలికి.. దగ్గరుండి మరీ స్వామి వారి దర్శనం, తదనంతర కార్యక్రమాలను చూసుకున్నారు.

స్వామి వారి సేవ తర్వాత శ్రీవెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలీ… దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా ఒక్క రోజు అన్నదానసత్రంలో భోజన వితరణకు అయ్యే మొత్తం ఖర్చును దానంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం రూ.44 లక్షలను అన్నదాన సత్రానికి నారా ఫ్యామిలీ డొనేట్ చేసింది. ఈ అన్నదానం వితరణకు అయ్యే ఒక్కరోజు ఖర్చు మొత్తాన్ని ఇచ్చే విషయాన్ని బాబు ఫ్యామిలీ ఓ ట్రెడిషన్ గా మార్చుకుందని చెప్పక తప్పదు. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా ఏటా చంద్రబాబు ఫ్యామిలీ ఈ రకంగా అన్నదాన వితరణలో ఒక్కరోజు ఖర్చును దానంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

అన్నదాన సత్రంలో తన మనవడితో కలిసి చంద్రబాబు అన్నదాన వితరణను స్వయంగా చేపట్టారు. తల్లి, సతీమణితో కలిసి లోకేశ్ కూడా అన్నదాన వితరణలో పాలుపంచుకున్నారు. ఓ వైపు తాత, మనవడు…మరో వైపు తల్లి, భార్యతో కలిసి లోకేశ్ వితరణలో పాలుపంచుకున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. అన్నదాన వితరణ తర్వాత ఐదుగురు అక్కడే ఒకే వరుసలో కూర్చుని అన్నదానాన్ని స్వీకరించారు. మనవడిని తన పక్కనే కూర్చోబెట్టుకుని చంద్రబాబు అన్నదానాన్ని స్వీకరించారు. తిరుమలలో చంద్రబాబు ఫ్యామిలీ పర్యటనకు సంబంధిచిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.