ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భరంగా ఉండేది. నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా వేచి చూసిన సందర్భాలు లేకపోలేదు. ఏనాడూ ఒకటో తారీఖున వారికి వేతనాలు అందిన దాఖలా కూడా లేదనే చెప్పాలి. అయితే కూటమి సర్కారు పాలన మొదలయ్యాక… పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వేతనాల విడుదలలో అంతగా జాప్యం జరగడం లేదు. అంతేనా.. ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐల్లో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను కూటమి సర్కారు రెండంటే రెండు దెబ్బలతో క్లియర్ చేసి పారేసింది. నిజంగానే ఇది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేదేనని చెప్పక తప్పదు.
ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన గత సర్కారు…. ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐల్లోనూ భారీ ఎత్తున బకాయిలు పెట్టింది. వేతనాలకే నిధులు లేకపోతే…ఇక ఉద్యోగుల ఈ భవిష్య నిధికి ఎలా చెల్లింపులు చేస్తామంటూ ఉద్యోగులనే నాటి ప్రభుత్వం ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. అంతేకాకుండా నాటి ప్రభుత్వాన్ని నిలదీసేందుకూ ఉద్యోగులకు ధైర్యం చాలలేదనే చెప్పాలి. మొత్తంగా ఓ ఆందోళన కరమైన వాతావరణం లో పనిచేసిన ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాహసించలేకపోయారు. దీనినే ఆసరా చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందిన కాడికి దోచుకున్నారు. ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారు. కావాల్సిన కాడికి బకాయిలు పెట్టేశారు.
ఈ తరహా చర్యల కారణంగా ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐలకు గత సర్కారు ఏకంగా రూ.7 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఉద్యోగులంతా ఆయన వద్దకెళ్లి తమ పరిస్థితిని ఆయన ముందు పెట్టి బోరుమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించే లక్షణమున్న చంద్రబాబు… మొన్న సంక్రాంతికి రూ.1,033 కోట్లను విడుదల చేశారు. ఫలితంగా ఉద్యోగులు సంక్రాంతి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. తాజాగా ఆ బకాయిలు మొత్తాన్ని క్లియర్ చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… ఉద్యోగుల సమస్యల పరిష్కారం కీలకమైనదన్న భానవతో మిగిలిన బకాయిలు మొత్తం రూ.6,200కోట్లను విడుదల చేయాలని ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులు శుక్రవారం ఆయా ఖాతాల్లో జమ కానున్నాయి.