మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన రోజుల్లోనే వారిద్దరి మధ్య అనుబంధం మొదలైంది. ఆ బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. వీరి మధ్య స్నేహ సంబంధాలు ఎంత బలీయమైనదంటే… చంద్రబాబు అలా నోరు తెరిచి అడిగినంతనే బిల్ గేట్స్ రంగంలోకి దిగిపోయేంత అని చెప్పాలి. జనవరిలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా బాబు ఓ మాట అడిగితే… రెండు నెలలు కూడా గడవకుండానే బిల్ గేట్స్ రంగంలోకి దిగిపోతున్నారు.
నిజమే మరి.. దావోస్ భేటీలో ఏపీ కష్టాలను, ప్రస్తుత స్థితిగతులను బిల్ గేట్స్ ముందు చంద్రబాబు పెట్టారు. చంద్రబాబు ప్రజెంటేషన్ విన్న తర్వాత మారు మాట్లాడకుండానే…సరే త్వరలోనే కలిసి పనిచేద్దామంటూ గేట్స్ సమాధానం ఇచ్చారు. బిల్ గేట్స్ ఈ మాటను ఇచ్చి బుధవారానికి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదు. మార్చి 21 నాటికి వారిద్దరి భేటీకి రెండు నెలలు నిండుతుంది. అయితే 2 నెలలు కూడా నిండకుండానే… చంద్రబాబుకు ఇచ్చిన మాట మేరకు ఏపీకి బాసటగా నిలిచేందుకు గేట్స్ రంగంలోకి దిగిపోతున్నారు. మంగళవారం రాత్రికే అటు గేట్స్, ఇటు చంద్రబాబు ఢిల్లీకి చేరుకోగా… వీరిద్దరి మధ్య భేటీ బుధవారం మధ్యాహ్నం జరగనుంది.
ఈ తాజా భేటీలో ఏపీలో ఆరోగ్యం, విద్య, సుపరిపాలన, గ్రామీణ జీవన వైవిధ్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, ఏఐ సాంకేతిక వినియోగం… తదితరాలకు సంబంధించి ఏపీతో బాసటగా నిలిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో బిల్ గేట్స్ మిలిండా ఫౌండేషన్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. గేట్స్, బాబు సమక్షంలోనే ఈ ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారత్ లో తన ఫౌండేషన్ కింద గేట్స్ భారీ ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఏపీలోనూ సదరు ఫౌండేషన్ కార్యకలాపాలు సాగుతున్నాయి. తాజాగా కూటమి సర్కారుతో ఆయా రంగాల అభివృద్ధి దిశగా గేట్స్ ఫౌండేషన్ పనిచేయనుంది.