టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో… టీడీపీ అభిమానులో, లేదంటే లోకేశ్ అంటే అభిమానం ఉన్న వారో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న శ్రీ కాశినాయన ఆశ్రమ పూజారులు, ఆ మఠం భక్తులు చెబుతున్న మాట. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఏళ్ల తరబడి కాశినాయన ఆశ్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అయితే కావాలని కాదు గానీ… ఆశ్రమానికి చెందిన కొన్ని భవనాలు టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాయంటూ అటవీ శాఖ అధికారులు వాటిని కూల్చేశారు. అయితే విషయం తెలిసిన వెంటనే బేషరతుగా సారీ చెప్పిన లోకేశ్… తిరిగి ఆ భవనాలను తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని చెప్పారు.
మాట ఇచ్చిన మేరకే… లోకేశ్ తన బృందాన్ని తెల్లారేసరికల్లా ఆశ్రమం వద్ద దింపేశారు. ఏమాత్రం ఆలస్యం లేకుండానే కూలిన భవనాల స్థానంలో కొత్తగా భవన నిర్మాణాలను ప్రారంభించేలా చేశారు. సాంకేతికతను వినియోగించుకున్న లోకేశ్ బృందం ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే సదరు భవనాల నిర్మాణాలను పూర్తి చేసింది. అంతేకాకుండా ఆ వెంటనే సదరు భవనాలను కాశినాయన ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించి… వినియోగించుకునేందుకు సర్వం సిద్ధంగా భవనాలు ఉన్నాయని చెప్పింది. లోకేశ్ బృందం నిర్మించిన ఆ భవనాలను చూసిన ఆశ్రమ నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… లోకేశ్ మార్కు స్పీడుకు ముచ్చటపడి.. భవనాలను సోమవారం నుంచే వినియోగించడం మొదలుపెట్టేశారు.
ఈ సందర్భంగా ఆశ్రమం వద్దకు వెళ్లే భక్తులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన బృందం… సోమవారం ఉదయమే సదరు బస్సును ఆశ్రమానికి తీసుకెళ్లారు. కూలిపోయిన భవనాల స్థానంలో సర్వాంగ సుందరంగా, అన్నదానానికి వినియోగించుకునేందుకు మరింత సౌలభ్యంగా ఉన్న సదరు భవనాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే భవనాలను నిర్మించి ఇచ్చిన లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ… థ్యాంక్యూ నారా లోకేశ్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టిన భక్తులు, ఆశ్రమ పూజారులు వాటిని ప్రదర్శించారు. మూడంటే మూడు రోజుల్లోనే సమస్యను పరిష్కరించడంతో పాటుగా కూలిన భవనాల స్థానంలోనే కొత్త భవనాలను చూసిన వారంతా నిజంగానే లోకేశ్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.