టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు… ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే చాలా తక్కువ వ్యవధిలోనే వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ లెగసీని భుజానికెత్తుకున్న వారి పెద్ద కుమార్తె, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఓ రేంజిలో రాణిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని వివాదాలను దాటుకుని వచ్చిన అఖిల అన్ని అవరోధాలను తట్టుకుని నిలబడ్డారు. అయితే తాజాగా సొంత పార్టీ నేతలే అధిష్ఠానానికి ఆమెపై ఫిర్యాదు చేయడంతో మరోమారు ఆమె వివాదంలో చిక్కుకున్నారు.
తాజా వివాదం నేపథ్యం ఏమిటన్న విషయానికి వస్తే… శనివారం నంద్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జల జీవన్ మిషన్ పై ఓ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డిలతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కారణం ఏమిటో తెలియదు గానీ… అఖిల ఈ సమావేశానికి గైర్హాజరు కాగా… ఆమె స్థానంలో ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేల పక్కనే వేదిక మీదే అఖిల కోసం వేసిన కుర్చీలో కూర్చున్న ఆయన… ఓ ప్రజా ప్రతినిధి మాదిరిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారట.
సమావేశం ముగిసే దాకా ఓపిక పట్టిన ఇద్దరు మంత్రులు ఆ తర్వాత… విఖ్యాత్ రెడ్డి ఏ హోదాలో ఈ సమావేశానికి హాజరు అయ్యారని అధికారులను నిలదీశారట. అయితే తామేమీ విఖ్యాత్ రెడ్డిని ఆహ్వానించలేదని, ఆయన కోసం వేదిక మీద కుర్చీ కూడా వేయలేదని… ఎమ్మెల్యే అఖిల కోసం వేసిన కుర్చీలో ఆయన కూర్చున్నారని వారు సమాధానం ఇచ్చారట. ఎమ్మెల్యే సోదరులు అధికారిక సమావేశాలకు హాజరవుతారా? అంటూ మంత్రులిద్దరూ విస్మయం వ్యక్తం చేశారట. అంతేకాకుండా.. అదేదో విపక్షానికి చెందిన సభ్యుల మారిదిగా అధికారులను నిలదీయడమేమిటని కూడా వారు ఒకింత అసహనానికి గురయ్యారట. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే… మరింత ముఖ్యమైన సమావేశాలకు కూడా ఇలా ఎమ్మెల్యేల బదులుగా వారి బంధువులు వచ్చి కూర్చుంటారన్న భావనతో ఈ విషయంపై వారిద్దరూ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట. మరి చంద్రబాబుకు అఖిల ఏమని సంజాయిషీ ఇచ్చుకుంటారో చూడాలి.