నిజమే… ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అవడానికి కొత్త పార్టీనే అయినా… దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. జనసేన 12వ ఆవిర్భావ వేడుకల కోసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శివారులోని చిత్రాడలో జయకేతనం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సభ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేసే పనిని కూడా జనసేననే తీసుకుంది. ఈ మేరకు జయకేతనం సభ పరిసరాల పరిశుభ్రతను జన సైనికులు శనివారమే ప్రారంభించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవసల జనసేన ఇంచార్జీ పేడాడ రామమోహన్ ఈ క్లీన్ అండ్ గ్రీన్ వీడియోను పోస్ట్ చేశారు.
పర్యావరణాన్ని కాపాడుతూనే ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఇదివరకే పవన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సభ ముగిసిన తర్వాత అక్కడ పేరుకుపోయే చెత్తా చెదారాన్ని శుభ్రం చేసే బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని పవన్ తీర్మానించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
పవన్ ఆదేశాలకు అనుగుణంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అధ్యక్షతన.. స్థానికంగా ఉండే ఓ 25 మంది పార్టీ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి సభ ముగియగా… శనివారమే ఈ కమిటీ రంగంలోకి దిగిపోయింది. చిత్రాడ పరిసరాల్లో సభ కారణంగా పేరుకుపోయిన చెత్తను ఈ కమిటీతో పాటు పేడాడ రామమోహన్ వంటి ఉత్సాహవంతులైన జన సైనికులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ సభ పెట్టాలనుకుంటే… ఎంపిక చేసిన ప్రదేశంలో ప్రభుత్వ అనుమతులతో సభలు పెడుతున్నాయి. ఆ తర్వాత తమ సామాన్లను తీసుకుని వెళ్లిపోతున్నాయి. అయితే తమ సభ కారణంగా అక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని క్లీన్ చేయాలన్న స్పృహ ఏ ఒక్క పార్టీలోనూ కనిపించడం లేదు. అయితే ఆ తరహా పార్టీలన్నింటికీ కనువిప్పు కలిగేలా జనసేన వ్యవహరిస్తోందని చెప్పాలి.
తాను ఏర్పాటు చేసిన సభ కారణంగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి… సభకు ముందు ఆ ప్రాంతం ఎలా ఉందో… అదే మాదిరిగా దానిని తీర్చిదిద్దే పనులకు జనసేన శ్రీకారం చుట్టడం నిజంగానే స్వాగతించదగ్గ అంశమే. అన్ని పార్టీలు జనసేనను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాల్సిందేనని చెప్పక తప్పదు.