వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి పెద్ద కార్పొరేష‌న్‌గా ఉన్న గుంటూరును ఆ పార్టీ ద‌క్కించుకుంది. నిజానికి బ‌ల‌మైన టీడీపీ ఓటు బ్యాంకును కూడా ఛేదించి ఇక్క‌డ పాగావేసింది. అయితే.. తాజాగా గుంటూరు మేయ‌ర్‌గా ఉన్న వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌టి శివ‌నాగ‌ మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న వైసీపీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. ప్ర‌స్తుతం మేయ‌ర్ ప‌ద‌వికి మాత్ర‌మే రాజీనామా స‌మ‌ర్పించిన ఆయ‌న దానిని కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ కు పంపించారు. ఆయ‌న ఆమోదం ల‌భించ‌గానే పార్టీకి కూడా నాయుడు రాజీనామా చేస్తార‌ని ఆయ‌న పార్టీ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. 2021 నుంచి మేయ‌ర్‌గా కొన‌సాగిన కావ‌టి శివ‌నాగ మ‌నోహ‌ర్ నాయుడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు అత్యంత ప్రాధాన్యం కూడా ఇచ్చారు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో మేయ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. కావ‌టికి.. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్క‌డ ఉన్న అభ్య‌ర్థి, అప్ప‌టి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీని గుంటూరు వెస్ట్‌కు పంపించారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో కావ‌టి 77 వేల ఓట్లు తెచ్చుకున్నా.. టీడీపీ నేత‌, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌గా కావ‌టిని జ‌గ‌న్ త‌ప్పించారు.

ఈ నేప‌థ్యానికి తోడు.. ప్ర‌స్తుతం గుంటూరులో కూట‌మి పార్టీల హ‌వా పెరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మి గుంటూరు కార్పొరేష‌న్ ప‌రిధిలోని తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా.. అన్ని చోట్లా విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో కార్పొరేష‌న్ ప‌రిధిలోని కార్పొరేట‌ర్లు దాదాపు 80 శాతం మంది వ‌ర‌కు కూట‌మి పార్టీల్లోకి జంప్ చేశారు. దీంతో మేయ‌ర్ కౌన్సిల్‌ను న‌డిపించేందుకు కోరం లేకుండా పోయింది. ఈ ప‌రిణామం కూడా.. కావ‌టి రాజీనామాకు దారి తీసింద‌న్న చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ టీడీపీ, జ‌న‌సేన‌లు క‌లిసి.. కార్పొరేష‌న్‌లో పాగా వేయ‌నున్నాయి.