తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజుననే రచ్చ సాగింది. ఈ రచ్చ జరిగింది సభలో కాదు. సభ ముగిసిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిన తర్వాత ఈ రచ్చకు రాష్ట్ర ముఖ్యమంత్రే తెర తీశారని చెప్పక తప్పదు. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు వచ్చారు. ఫలితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. కేసీఆర్ రాకతో ఈ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయన్న వాదనలూ వినిపించాయి. అయితే కొద్దిేసపటికే అటు అధికార పక్షంతో పాటుగా ఇటు విపక్షం కూడా కట్టు దాటిపోయి పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ఈ కట్టు దాటే వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డే ప్రారంభించారు. కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేచర్ చూసుకుని విర్రవీగి… స్ట్రెచర్ పై పడ్డారంటూ ఆయన కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని రేవంత్..ఇప్పటికైనా సర్దుకోకపోతే మార్చురీకి వెళతారంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిజంగానే తెలుగు రాజకీయాల్లో కలకలం రేపాయి. ఓ మాజీ సీఎం చావును కాంక్షిస్తూ మరో సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ సీఎం స్థాయిలో ఉన్న నేత నోట నుంచి ఈ వ్యాఖ్యలను ఊహించలేదన్న వాదనలూ వినిపించాయి.
రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.ఈ పిచ్చి కుక్క సభ్యతకు ఉన్న అన్ని హద్దులను దాటేసిందని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పిచ్చి లేసిందని… తక్షణమే ఆయనను పిచ్చి ఆసుపత్రికి తరలించాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ ను వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించండి అంటూ ఆయన రేవంత్ కుటుంబానికి సూచించారు. ఇక ఆ తర్వాత కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజకీయ పరిపక్వత లేకనే రేవంత్ మార్చురీ వ్యాఖ్యలు చేశారంటూ నిందించారు. విపక్ష నేత మరణాన్ని కోరుకుంటున్న రేవంత్ ది నీచ బుద్ధి అంటూ ఆయన ఫైరైపోయారు. ఇక బీఆర్ఎస్ కు చెందిన మరింత మంది నేతలు రేవంత్ పై విరుచుకుపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.