కూట‌మికి కొత్త ఉత్సాహం!

కూట‌మికి కొత్త ఉత్సాహం వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన‌ల్లో అయితే.. ఈ ఉత్సాహం మ‌రింత రెట్టింప‌యింది. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితం కూట‌మి పార్టీలకు సంతృప్తినివ్వ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ ప‌నితీరుకు మేధావులు, విద్యావంతులు సైతం జై కొట్టిన‌ట్టుగా సర్కారు లెక్క‌లు వేసుకుంది. ఇది మున్ముందు కూడా త‌మ‌కు లాభిస్తుంద‌ని భావిస్తున్నారు. సాధార‌ణంగా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు స‌ర్కారు ప‌నితీరుకు అద్దంప‌ట్టాయ‌నే చెప్పాలి.

గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆ పార్టీకి వ్య‌తిరేకంగా గ్రాడ్యుయేట్లు పోటెత్తారు. అప్ప‌ట్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కానీ.. ఇప్పుడు కూట‌మి పార్టీల‌కు గ్రాడ్యుయేట్లు జై కొట్టారు. అంటే.. ఒక‌ర‌కంగా.. ఇది ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది. నిజానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 9 మాసాలు అయిన నేప‌థ్యంలో వ్య‌తిరేక‌త ఉంటుంద‌న్న భావ‌న అయితే.. పైకి క‌నిపించింది. కానీ, ఆ త‌ర్వాత మాత్రం.. ఎక్క‌డా ఆ ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

సో.. ఇది తమ ప్ర‌భుత్వానికి ల‌భించిన మ‌ద్ద‌తుగానే చంద్ర‌బాబు స‌హా నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక‌లు వ‌చ్చినా.. పార్టీలు ప‌రుగులు పెట్టాలన్న వ్యూహాన్ని కూడా అమ‌లు చేయనున్నారు. ఇది ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగాను వైసీపీకి న‌ష్టం చేకూర్చే అంశ‌మేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెర‌గ‌లేద‌న్న సంకేతాలు వ‌చ్చాయంటే.. ప‌రోక్షంగా వైసీపీని ప్ర‌జలు అంగీక‌రించ‌డం లేద‌న్న విష‌యం వాస్త‌వం.

కాబట్టి కూట‌మిలో కొత్త ఉత్సాహం పొంగిపొర్లిన‌ప్పుడ‌ల్లా.. వైసీపీ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇక,కూట‌మి ప‌రంగా చూసుకుంటే.. క‌లివిడి మ‌రింత పెరిగితేనే త‌ప్ప‌.. రాజ‌కీయంగా ఇప్పుడున్న సానుకూల‌త సార్వ‌త్రిక ఎన్నికల నాటికి బ‌లోపేతం కావ‌డం క‌ష్టం. కాబ‌ట్టి.. కూట‌మి పార్టీలు స‌ఖ్య‌త‌, ఐక్య‌త దిశ‌గా మ‌రింత దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. సాధించిన దానికి సంతృప్తిని చెంద‌డం కంటే.. మ‌రింత మెరుగైన ఫ‌లితాలు సాధించే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంది.