నిర్మాత కేదార్ మృతి ఓ మిస్టరీ: రేవంత్ రెడ్డి

తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ కు చెందిన నిర్మాత సెలగంశెట్టి కేదార్ దుబాయిలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ వివాహానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు దుబాయి వెళ్లారు. వీరిలో కేదార్ కూడా ఉన్నారు. అయితే మిగిలిన వారంతా క్షేమంగానే తిరిగి రాగా.. కేదార్ మాత్రం విగత జీవిగా తిరిగి వచ్చారు. దుబాయిలో అనారోగ్యం కారణంగా కేదార్ మరణించారని తొలుత వార్తలు రాగా…ఆ తర్వాత ఈ మరణం వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉందంటూ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత అక్కడే మీడియా మాట్లాడిన సందర్భంగా రేవంత్…కేదార్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దుబాయిలో కేదార్ మరణించారన్న విషయం ప్రస్తావనకు వచ్చినంతనే.. కేదార్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యాపార భాగస్వామిగా, మిత్రుడిగా రేవంత్ అభివర్ణించారు. దుబాయిలో కేదార్ మరణం ఓ పెద్ద మిస్టరీనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మిస్టరీ ఏమిటని కూడా ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఇటీవలే హైదరాబాద్ లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్ పార్టీ రాడిసన్ హోటల్ లో జరిగిందని… అందులో కేదార్ కూడా పాలుపంచుకున్నారని కూడా రేవంత్ అన్నారు.

”కేసులలో ఉన్న వారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవ రెడ్డి, ఆ తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్..వీరి మరణాల వెనుక మిస్టరీ ఉంది. దీనిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు. ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం” అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణతో పాటు టాలీవుడ్ లోనూ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. కేటీఆర్ డ్రగ్స్ వాడతారంటూ గతంలోనే రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేదార్ మరణం, అది కూడా దుబాయి వేదికగా చోటుచేసుకోవడం, మరణానికి గల కారణాలు తెలియకపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది.

టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో మంచి సంబంధాలు కలిగిన కేదార్ పెద్దగా సినిమాలేమీ నిర్మించలేదు. విజయ్ దేవరకొండ సోదరుడితో ఇటీవలే ఆయన గంగం గణేశా అనే చిత్రాన్ని తీశారు. అంతకుముందు ఒకటో, రెండో చిత్రాలను మాత్రమే ఆయన నిర్మించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయనకు మంచి స్నేహం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దుబాయిలో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరై ఆ తర్వాత తనకు కేటాయించిన గదికి వెళ్లి నిద్రించిన కేదార్.. నిద్రలోనే మరణించారు. ఆ సమయంలో కేదార్ తో పాటు తెలంగాణకు చెందిన ఓ తాజా మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారట. ఓ మాజీ ఎమ్మెల్యేను ఇప్పటికే దుబాయి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా కేదార్ మరణంపై రేవంత్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.