దళిత యువకుడి కిడ్నాప్, ఆపై బెదిరింపుల కేసులో అరెస్టై జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్… ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి తదితర కేసుల్లో వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. పోలీసులు పది రోజుల కస్టడీ అడిగితే… కోర్టు 3 రోజుల పాటు వంశీని పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో మంగళవారం వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. బుధవారం కూడా విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను మాట్లాడించే యత్నం చేశారు.
ఈ క్రమంలో జైలులో ఎలా ఉంది సార్ అంటూ ఓ లేడీ జర్నలిస్టు ప్రశ్నించినంతనే… బ్రహ్మాండంగా ఉంది అంటూ వంశీ ఊహించని సమాధానం ఇచ్చారు. ఇక మరిన్ని కేసులు నమోదు అవుతున్నాయి కదా… ఎలా మరి అంటూ ఆ విలేకరి ప్రశ్నించగా… అందులో ఇక చెప్పడానికి కొత్తగా ఏముంది? అంటూ వంశీ నర్మగర్భంగా బదులిచ్చారు. తనకేమీ ఇబ్బంది లేదని చెబుతూనే ఆయన పోలీస్ వ్యాన్ ఎక్కేశారు. వాస్తవానికి వంశీ గానీ, కొడాలి నాని గానీ.. మీడియా ప్రశ్నలకు తమదైన శైలి వ్యంగ్యం కలిపి స్పందిస్తూ ఉంటారు. అరెస్టై జైలుకు వెళ్లినా కూడా వంశీలో ఈ స్టైల్ ఇంకా ఏమాత్రం తగ్గలేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. చూడటానికి వంశీలో పెద్దగా మార్పేమీ కనిపించలేదని కూడా చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… తొలి రోజు అయిన మంగళవారం కేవలం రెండున్నర గంటల సేపు మాత్రమే వంశీని పోలీసులు విచారించారు. అయితే రెండో రోజు ఈ విచారణ గడువు డబుల్ అయ్యింది. బుధవారం వంశీని పోలీసులు ఏకంగా 5 గంటల పాటు విచారించారు. తొలి రోజు విచారణలో పోలీసులు వంశీ నుంచి పెద్దగా వివరాలేమీ రాబట్టలేకపోయారని సమాచారం. అయితే రెండో రోజు విచారణలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని వారు వంశీ నుంచి రాబట్టగలిగారని తెలుస్తోంది. అంతేకాకుండా వంశీపై నమోదు అయిన ఇతరత్రా కేసుల వివరాలను కూడా పోలీసులు కొంతమేర రాబట్టినట్లు సమాచారం.