గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పొగాకు బోర్డును కేంద్ర ప్రభుత్వం మరింతగా పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు బోర్డులోకి ముగ్గురు ప్రజా ప్రతినిధులకు స్థానం కల్పించింది. దేశంలో పొగాకు సాగు, రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంతో పాటుగా పొగాకు వినియోగం నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపైనా దృష్టి సారించేందుకు కేంద్రం ఏళ్ల క్రితమే పొగాకు బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పొగాకు అత్యధికంగా సాగు అయ్యే ఏపీలో పొగాకు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించిన కేంద్రం… గుంటూరులో ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న ఈ బోర్డుకు ఓ సీనియర్ అదికారితో పాటు రబ్బర్ స్టాంప్ లాంటి చైర్మన్ ను ఎంపిక చేసి ఏదో అలా బోర్డు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో బోర్డు పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్న వాదనలు లేకపోలేదు. అంతేకాకుండా బోర్డు పేరు చెప్పుకుని అక్రమార్కులు కోట్లాది ప్రభుత్వ నిధులతో పాటుగా రైతుల సొమ్మును కూడా కాజేస్తున్నారు. ఈ తరహా దోపిడీలపై ఇప్పటికే సీబీఐ కేసులు నమోదు కాగా… మార్కెటింగ్ శాఖకు చెందిన చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బోర్డును మరింత ప్రభావవంతగా మార్చే దిశగా కేంద్రం అడుగులు వేసింది. బోర్డులో గతంలో కొనసాగుతున్న వ్యవస్థను అలాగే ఉంచేసి… కొత్తగా బోర్డులోకి ముగ్గురు ఎంపీలకు స్థానం కల్పించింది. లోక్ సభ నుంచి ఇద్దరు, రాజ్యసభ నుంచి ఒక సభ్యుడిని బోర్డులో నియమించింది. ఈ నియామకాలను కూడా కేంద్రం పూర్తి చేసింది. ఈ ముగ్గురు సభ్యుల్లో పొగాకు అధికంగా సాగు అవుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఎంపీలకు చోటు దక్కగా… మరొకరు ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
ఈ మేరకు పొగాకు బోర్డులో సభ్యులుగా వ్యవహరించనున్నవారి పేర్లను కేంద్రం మంగళవారమే ప్రకటించింది. వారిలో ఏలూరు ఎంపీగా కొనసాగుతున్న టీడీపీ యువనేత పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ ఒకరు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడుగానే కాకుండా… టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడే పుట్టా మహేశ్. ఇక రాజ్యసభ ఎంపీ కోటాలో తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్యణ్ ను కేంద్రం ఎంపిక చేసింది. ఇక మూడో సభ్యుడిగా లోక్ సభ సభ్యుడు డీఎం కతీర్ ఆనంద్ ను కేంద్రం బోర్డులో సభ్యుడిగా నియమించింది.