వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి జారీ అయిన ఆదేశాలతో వేగంగా కదిలిన అధికార యంత్రాంగం ఇప్పటికే సదరు విచారణను పూర్తి చేసి నివేదికను సిద్దం చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ చేపట్టిన ఈ విచారణలో సంచలన వాస్తవాలు వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఆరోపించినట్టుగా పెద్దిరెడ్డి అటవీ భూములను దురాక్రమించినట్టుగా విజిలెన్స్ తేల్చిందని సమాచారం.
పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉన్న చోట ఆయనకు కొంత భూమి ఉన్న మాట వాస్తవమేనట. అయితే తనకున్న భూమికి ఆనుకుని ఉన్న అటవీ భూములను ఆక్రమించేసిన పెద్దిరెడ్డి… ఆ భూములను తనతో పాటుగా రాజంపేట ఎంపీగా ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట రిజిష్టర్ చేయించుకుని… వాటిని తన భూమిలో కలిపేసుకున్నారని సమాచారం. విజిలెన్స్ నివేదిక ప్రకారం… అక్కడ పెద్దిరెడ్డికి కేవలం 23.69 ఎకరాలు మాత్రమే ఉందట. అయితే ఆ భూమిని ఆనుకుని ఉన్న అటవీ భూమిని ఆక్రమించిన పెద్దిరెడ్డి… మొత్తంగా 104 ఎకరాలకు కంచె వేసుకున్నారట. అంటే.. పెద్దిరెడ్డి ఏకంగా 90 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నారన్న మాట.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ కు కేటాయించిన 1600 ఎకరాల భూముల్లో కేవలం 14 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని తేలితేనే… కూటమి సర్కారు వాటిని వెనక్కు తీసుకుంది. మరి పెద్దిరెడ్డి ఏకంగా 90 ఎకరాలను ఆక్రమించి… దానిని తన వ్యవసాయ క్షేత్రంగా మలచుకుంటే సర్కారు ఊరుకుంటుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. దురాక్రమణలకు గురైన భూములను వెనక్కి తీసుకునేంత వరకు మాత్రమే చర్యలు ఉంటే సరేసరి… లేదంటే పెద్దిరెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదర్కొక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 90 ఎకరాల మేర అటవీ భూములను దురాక్రమించిన పెద్దిరెడ్డిపై ఏ మేర చర్యలు తీసుకుంటారన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.