తిరుమల ‘కల్తీ నెయ్యి’ కొలిక్కి వచ్చినట్టేనా..?

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నమోదు అయిన కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచినట్టేనని చెప్పక తప్పదు. లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చ్చిన కాలంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన మూడు కంపెనీలకు చెందిన యజమానులను సిబిఐ అధికారులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వారిని తిరుపతికి తరలించిన సిబిఐ.. వారిని సోమవారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న దిశగా కీలక ఆధారాలు ఏకరించిన తర్వాతే సిబిఐ ఈ అరెస్టులను చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సిబిఐ అరెస్ట్ చేసిన వారిలో ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌.. వైష్ణవి డెయిరీ లిమిటెడ్‌ సీఈఓ అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా, తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్ ఉన్నారు. వీరితో పాటుగా ఈ మూడు కంపెనీలకు చెందిన మ‌రో పది మంది సిబ్బంది సిట్ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. డెయిరీలకు చెందిన మేనేజర్ల నుంచి అధికారులు, ల్యాబ్ స్టాఫ్, ట్యాంకర్లకు డ్రైవర్లుగా పని చేసిన వారు సిట్ అదుపులోనే ఉన్నట్లు స‌మాచారం. ఏఆర్‌, బోలేబాబా, వైష్ణవి డెయిరీల సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్‌ బృందాలు త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు కలకలం రేపగా… ఈ వ్యవహారంపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సిబిఐ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు నేతృత్వం వహిస్తున్నారు. అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా తీసిన సిట్ ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను గుర్తించినట్లు తెలుస్తోంది. లడ్డూ తయారీ కేంద్రం నుంచి నెయ్యి టెండర్లు, సరఫరా చేసిన సంస్థల వరకు సిట్ పలు కోణాల్లో దర్యాప్తు చేసి, పలువురిని విచారించింది. అందులో భాగంగానే సిబిఐ తాజా అరెస్టులు చేసినట్టు సమాచారం.

లడ్డూ కల్తీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌… వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు సిబిఐ తన రేమండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. అటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు పొందిన ఏఆర్‌ డెయిరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్లు సిట్‌ బృందం నిర్ధారించింది. దాంతో నాలుగు రోజులుగా ఏఆర్‌, వైష్ణవి డెయిరీల్లో విచారణ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. వెరసి ఈ కేసు గుట్టు వీడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.