‘బండి’ కి అఫిషియల్ గా రూట్ క్లియర్

Bandi Sanjay
Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలను స్వీకరించారు. బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన బండి సంజయ్ అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. పూజ ముగిసిన తర్వాత అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్న సంజయ్….తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తానని అన్నారు.

అధిష్టానం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తెలంగాణలో బీజీపీ మరింత బలపడేలా చేస్తానని అన్నారు. వాస్తవానికి, లాక్ డౌన్ ముగిసిన తర్వాత అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించాలని బండి సంజయ్ అనుకున్నారు. అయితే, కరోనా విపత్తు నేపథ్యంలో పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో ఈ రోజు బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది.

అయితే, లాక్ డౌన్ వల్ల పరిమిత సంఖ్యలో కొందరు కీలకమైన నేతలు మాత్రమే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యకర్తలెవరూ ఈ కార్యక్రమానికి రావద్దని సంజయ్ ముందే పిలుపునిచ్చారు. మార్చి 10న బండి సంజయ్ ను బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ కొత్త పుంతలు తొక్కుతుందని పార్టీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.

సామాన్య కుటుంబంలో పుట్టిన సంజయ్…కార్యకర్త స్థాయి నుంచి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానంలో టీఆర్ఎస్ కీలక నేత వినోద్ ను సంజయ్ ఓడించారు. ఈ మ‌ధ్య కాలంలో క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ పేరు త‌ర‌చుగా వార్త‌ల్లో వినిపిస్తోంది.

కొత్త‌గా ఎన్నికైన ఎంపీ అయిన‌ప్ప‌టికీ అన‌తికాలంలోనే త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని సంపాదించుకున్నారు సంజ‌య్‌. ఓ వైపు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ….మ‌రో వైపు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ల‌కు మ‌ద్ద‌తుగా ముమ్మ‌రంగా త‌న గ‌ళం వినిపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్ర‌చారంలోనూ, గాంధీ సంకల్ప యాత్రలో సంజ‌య్ ఒన్ మ్యాన్ షో చేశారు. సీనియ‌ర్ల గైర్హాజ‌రును ప‌ట్టించుకోకుండా త‌న వాగ్దాటితో నెట్టుకొచ్చారు.

అతి తక్కువ కాలంలోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా సంజ‌య్‌ను అధిష్టానం నియ‌మించాల‌ని భావించిందంటే సంజ‌య్‌కున్న ప్రాధాన్య‌త ఎటువంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, ఇంత పాపులారిటీ ఉన్న‌ సంజ‌య్‌కు సొంత‌పార్టీలోని కొంద‌రు నేత‌లు ఎస‌రు పెట్టాల‌ని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది‌. గతంలో సంజయ్‌కు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వ‌కుండా అడ్డుపుల్ల‌లు వేసిన సీనియ‌ర్లు….ఎమ్మెల్యేగా ఓట‌మి పాలై ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినప్పుడూ సంజ‌య్‌కు మోకాల‌డ్డార‌ట‌.

రాష్ట్ర అధ్యక్షుడిగా సంజ‌య్ రూపంలో బ‌ల‌మైన నేత ల‌భించినా…కరీంనగర్ జిల్లా బీజేపీ గ్రూపు రాజ‌కీయాలు త‌ట‌స్థ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయట. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ కు సీనియర్లు, మరో వర్గం నేతలు ఎంతరకు సహకరిస్తారు…వారిని కలుపుకొని సంజయ్ ఏవిధంగా ముందుకు పోతారన్నది వేచి చూడాలి.