పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ పథకం కింద… గుండె పోటు వచ్చిన పేదలకు చికిత్స అందేవరకు వారి ప్రాణాలను నిలబెట్టేలా సర్కారు చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా… గుండెపోటు వచ్చిన తోలి గంటలో రోగికి ఇవ్వాల్సిన టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఇంజక్షన్ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. ఇంత ఖరీదు చేసే ఇంజక్షన్ ను కూడా పేదలకు ఉచితంగానే ఇవ్వాలని చంద్రబాబు సర్కారు తీర్మానించింది.

ఇటీవలి కాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఓ స్థాయి ఆర్ధిక స్తొమత ఉన్న వారు అయితే ఫరవా లేదు గానీ.. పేదలకు గుండె పోటు వస్తే ప్రాణాంతకమే. సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలంటే…సమయం పడుతుంది. ఈ లోగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుండెపోటు వస్తే సకాలంలో చికిత్స అందితే… పెద్దగా ముప్పేమీ ఉండదు. అయితే ఆ చికిత్స సకాలంలో అందడమన్నది అన్ని ప్రాంతాలకు సాధ్యం అయ్యే పని కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ అత్యంత కీలకమని చెప్పాలి. ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగానే అందిస్తే… పేదల ప్రాణాలకు భరోసా దక్కినట్టే.

సాధారణంగా గుండెపోటు వస్తే… క్షణాల్లో డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టమే. ఓ వైపు ఆర్ధిక స్తొమత, మరోవైపు ఆసుపత్రుల దూరాభారం పేదలకు ప్రాణాంతకంగా మారింది. ఈ పరిస్థితులపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గుండె పోటు వచ్చినా కూడా పేదలు భయపడకూడదన్న భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పేదల ఆరోగ్య పరిరక్షణలో ఓ కీలక మైలు రాయిగా పరిగణించవచ్చు. గుండెపోటు మరణాలు కూడా ఈ నిర్ణయం వల్ల భారీగా తగ్గుతాయని చెప్పాలి.