ఎమ్మెల్సీ కిడ్నాప్ అన్న భూమన.. లేదన్న ఎమ్మెల్సీ

తిరుపతి నగర పాలక సంస్థలో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ ఎన్నిక గడచిన నాలుగైదు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాటకీయ పరిణామాలకు కారణంగా నిలిచింది. సరిగ్గా… డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైన వేళ… తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా… ఆ వ్యాఖ్యలు సరికాదని ఆ మరుక్షణమే తేలిపోవడం గమనార్హం.

వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగగా… ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వైసీపీకే దక్కాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి… వైసీపీని చిత్తు చేయగా… తిరుపతికి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. ఈ క్రమంలో వైసీపీ బలం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మారిన బలాబలాల నేపథ్యంలో జరుగుతున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తిరుపతి జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఆయన చేతిలో పరాజయం పాలైన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేశారు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి తిరుపతికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ నకు గురయ్యారని వార్తలు వచ్చాయి. దీనిపై మంగళవారం స్పందించిన భూమన… వైద్యుడైన సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ,జనసేనలకు చెందిన నేతలు కిడ్నాప్ చేయడం సరికాదన్నారు. ఈ కిడ్నాప్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శాప్ చైర్మన్ రవి నాయుడు కీలక భూమిక పోషించారని ఆయన ఆరోపించారు. సుబ్రహ్మణ్యానికి ఏం జరిగినా కూటమిదే బాధ్యత అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా తన కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని… సమయానికి తిరుపతి ఎంపి గురుమూర్తి, తన సతీమణి అక్కడికి వెళ్లి అభినయ్ ని క్షేమంగా తీసుకువచ్చారంటూ ఆయన ఆరోపించారు.

భూమన ఇలా మీడియాతో మాట్లాడిన కొంతసేపటికే సిపాయి సుబ్రహ్మణ్యం వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చి చేరింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను క్షేమంగానే ఉన్నానని ఆయన సదరు వీడియోలో తెలిపారు. తాను కిడ్నాప్ అయ్యానన్న వార్తలు పూర్తిగా నిరాధారమని ఆయన తెలిపారు. అంతేకాకుండా సోమవారం రాత్రి తాను తన ఇంటిలోనే ఉన్నానని కూడా తెలిపారు. ఈ వీడియోతో భూమన కూటమి పార్టీలపై అసత్య ఆరోపణలు చేశారని తేలిపోయింది. ఏమీ జరగకున్నా..కిడ్నాప్, హత్యాయత్నం అంటూ భూమన రాద్దాంతం చేస్తున్నారని కూటమి పార్టీల నేతలు సెటైర్లు సంధించారు. వెరసి భూమన అడ్డంగా బుక్కయ్యారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.