అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యూహాల రచన, వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తల పండినట్టుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యూహాలు పెమ్మసాని ముందు చిత్తు అయ్యాయని కూడా చెప్పక తప్పదు. చడీచప్పుడు లేకుండా పెమ్మసాని వ్యూహాలు అమలు అయిన తీరుపై ఇప్పుడు వైసీపీలో పెను చర్చే నడుస్తోంది.
గుంటూరు నగర పాలక సంస్థలో 6 స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరగగా… మెజారిటీ పరంగా అన్ని కూడా వైసీపీకే దక్కాలి. అయితే పెమ్మసాని ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేశారో అప్పుడే.. ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. పెమ్మసాని కాకుండా ఇంకొకరు అయి ఉంటే వారిని టీడీపీలోకి ఆహ్వానించే వారే, అయితే టీడీపీ వైపు చూస్తున్న సదరు కార్పొరేటర్లను వైసీపీలోనే ఉంచి… ఆ పార్టీ షాక్ ఇచ్చేలా చేశారు. పెమ్మసాని ప్లాన్ వర్కవుట్ కావడంతో అంబటి సహా వైసీపీ శిబిరం షాక్ కు గురైంది.
మొన్నటి ఎన్నికల తర్వాత గుంటూరు కార్పొరేటర్లలో చాలా మంది జంప్ కొట్టేసిన తర్వాత కూడా వైసీపీకే స్వల్ప ఎడ్జ్ ఉంది. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తీరుతామని అంబటి భావించారు. ఆ మేరకు వైసీపీ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించారు. అంతా బాగానే ఉన్నట్లు కలరింగ్ ఇచ్చిన పెమ్మసాని… లోపల ఏం చేయాలో అది అప్పటికే పూర్తి చేసి తనకేమీ తెలియనట్లు కూర్చున్నారు. సోమవారం జరిగిన స్టాండింగ్ ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ నుంచి 5 నుంచి 6 మంది కార్పొరేటర్లు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. ఫలితంగా ఆరుకు ఆరు స్టాండింగ్ కమిటీలు టీడీపీ ఖాతాలోకి చేరిపోయాయి.