ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల కోసం అటు అధికార ఆప్ తో పాటు ఇటు విపక్ష బీజేపీ కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే… శనివారం నుంచి ఢిల్లీ వీధులు తెలుగు నేతల ప్రచారంతో హోరెత్తిపోతున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి ఢిల్లీ ప్రచార బరిలోకి దూకేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజులు ఢిల్లీ వీధులన్నీ తెలుగు నేతల ప్రచారంతో తడిసి ముద్ద కానున్నాయి.
ఇదంతా చూస్తుంటే… టీడీపీ ఆవిర్భావానికి కారణంగా నిలిచిన నాటి ఘటనలు మన బుర్రల్లో గిర్రున తిరుగుతున్నాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో తెలుగుకు ఎంతమాత్రం ప్రాధాన్యం దక్కని నాటి పరిస్థితులను చూసి అన్న గారు, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వీధుల్లో తెలుగు ఆత్మ గౌరవానికి అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి విరుగుడుగానే ఆయన ఏకంగా టీడీపీని స్తాపించారు. 9 నెలలు తిరక్కుండానే డిల్లీ గద్దె మీద ఉన్న కాంగ్రెస్ పాక్టీని తెలుగు గడ్డలో నేలకు దించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం దెబ్బ ఎలా ఉంటుందో నాటి ఢిల్లీ పాలకులకు రుచి చూపించారు.
అన్న గారు ఇప్పుడు లేకున్నా… ఆయన కోరినట్టుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఢిల్లీ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి టీడీపీ బలం కీలకం. ఎన్టీఏలో కీలక భాగస్వామి. తెలుగు నేతల సత్తాను గుర్తించిన ఢిల్లీ పాలకులు ఇప్పుడు వారితో ప్రచారం చేయించుకుని విజయం సాదించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వెరసి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత తరుణంలో పదుల సంఖ్యలో తెలుగు నేతలను రంగంలోకి దించేశారు.
ఆదివారం రాత్రి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి చంద్రబాబు దిగుతున్నారు. చంద్రబాబు కంటే ముందుగానే బరిలోకి దిగిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీకి చెందిన కీలక నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, రఘునందన్ రావు.. టీడీపీ నేత, ఏపీ మంత్రి పార్థసారధ మరికొందరు నేతలు ఢిల్లీ ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. మొత్తం మీద ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో తెలుగు ఆత్మ గౌరవం ప్రతిధ్వనిస్తోంది.