వైసీపీ ‘ర‌హస్యం’ బ‌ట్ట‌బ‌య‌లు!

Y S Jagan

వైసీపీ ర‌హ‌స్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు కూట‌మి స‌ర్కారు సిద్ధ‌మైంది. వైసీపీ హ‌యాంలో సుమారు 320కి పైగా ర‌హ‌స్య జీవోలు ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు ఉన్న విషయం తెలిసిందే. అప్ప‌ట్లో టీడీపీ స‌హా బీజేపీ నాయ‌కులు కూడా.. ర‌హ‌స్య జీవోల‌పై న్యాయ పోరాటం కూడా చేశారు. హైకోర్టుకు వెళ్లి వైసీపీ స‌ర్కారుపై పిటిష‌న్లు కూడా వేశారు. అప్ప‌ట్లో కోర్టు ఆదేశాల మేర‌కు కొన్ని జీవోల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్ చేసినా.. వంద‌ల సంఖ్య‌లో జీవోల‌ను మాత్రం దాచి పెట్టారు.

కోర్టు చెప్పినా.. రాజ‌కీయ పార్టీల నుంచి ప్ర‌జా సంఘాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వైసీపీ ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. వైసీపీ ర‌హ‌స్య జీవోల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీని ఇప్పుడు అమ‌లు చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఇచ్చిన ర‌హ‌స్య జీవోల‌ను ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో పెట్టేందుకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సుమారు 320 జీవోల‌ను ర‌హ‌స్యంగా ఉంచార‌ని అధికారులు కూడా అంచ‌నా వేస్తున్నారు. వీటిలో రెవెన్యూ జీవోలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. అదేవిధంగా హోం శాఖ‌కు చెందిన జీవోలు కూడా ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఇప్పుడు వీటిని జీవోఐఆర్‌(గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్ ఇష్యూ రిజిస్ట‌ర్‌)లో వాటిని ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచ‌నున్నారు. త‌ద్వారా.. అస‌లు వైసీపీ హ‌యాంలో ఏయే అంశాల‌పై ర‌హ‌స్య జీవోలు ఇచ్చారు..? వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అనేది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌ని కూట‌మి స‌ర్కారు నిర్ణ‌యించుకుంది.