ఓజీ కథ.. పవన్ కంటే ముందు వరుణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ఓజీ. రన్ రాజా రన్, సాహో చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం పవన్ నుంచి అభిమానులు కోరుకునే అత్యుత్తమ వినోదాన్ని అందిస్తుందనే అంచనాలున్నాయి. పవన్ ఈ సినిమా షూట్లో పాల్గొన్న స్పీడు చూస్తే.. గత ఏడాదే ఈ మూవీ రిలీజైపోతుందని అనుకున్నారు కానీ.. అది సాధ్యపడలేదు. ఈ ఏడాది కూడా విడుదల కుదరలేదు. వచ్చే వేసవిలో ‘ఓజీ’ విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో భాగమైన అందరూ దీని గురించి గొప్పగా చెబుతున్నారు. ఇప్పుడు సినిమాతో సంబంధం లేని మెగా హీరో వరుణ్ తేజ్ సైతం ‘ఓజీ’కి ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. తన కొత్త చిత్రం ‘మట్కా’ టీజర్ లాంచ్ సందర్భంగా వరుణ్ ‘ఓజీ’ ప్రస్తావన తెచ్చి అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మాటలు చెప్పాడు.

‘ఓజీ’ కథను బాబాయ్ పవన్ కళ్యాణ్ కంటే ముందు తాను విన్నట్లు వరుణ్ వెల్లడించాడు. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా మోత మోగిపోతుందని.. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకంటే ఎక్కువగా ఉంటుందని వరుణ్ చెప్పాడు. బాబాయి బిజీగా ఉన్న సంగతి అభిమానులకు తెలుసని.. కాబట్టి కొంచెం ఓపిగ్గా సినిమా కోసం ఎదురు చూడాలని కోరాడు వరుణ్. సినిమా ఆలస్యమైనా కంటెంట్ ఒక రేంజిలో ఉంటుందని వరుణ్ భరోసా ఇవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

ఇక ‘మట్కా’ గురించి చెబుతూ.. చాలామంది ఫ్యాన్స్ తనను ‘గద్దలకొండ గణేష్’ లాంటి సినిమా చేయమని అడుగుతుంటారని.. వాళ్లకు సమాధానమే ఈ సినిమా అని వరుణ్ అన్నాడు. ఈ చిత్రం ఒక మాస్ జాతరలా ఉంటుందని.. ఇది కచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ‘మట్కా’ నవంబరు 14న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటించారు.