చిరంజీవికే దొరకట్లేదు.. రాజశేఖర్‌కు దొరుకుతారా?

సీనియర్ హీరోల కష్టం ఇప్పుడు మామూలుగా లేదు. వాళ్ల పక్కన కథానాయికల్ని సెట్ చేయడం సవాలుగా మారుతోంది. టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవికి సైతం హీరోయిన్‌ను వెతకడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల మాదిరి తమ వయసులో సగం కంటే తక్కువ వయసున్న కథానాయికలతో ఇప్పటి సీనియర్లు రొమాన్స్ చేసే పరిస్థితి లేదు. అలా చేస్తే సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ తట్టుకోవడం కష్టం.

ఇక ఇంతకుముందు తమ సరసన నటించిన కథానాయికలను తీసుకుందామంటే వాళ్లలో చాలామంది ఫేడవుట్ అయిపోయారు. ఫాంలో ఉన్న వాళ్లకు డేట్ల సమస్య ఉంది. దీంతో సీనియర్ హీరోల సినిమాలు మొదలై షూటింగ్ జరుపుకుంటున్నా కూడా కథానాయికల సంగతి మాత్రం తేలకుండా ఉంటోంది. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకూ ఈ ఇబ్బంది ఎదురైంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల సినిమాలకూ ఈ తలనొప్పి తప్పట్లేదు.

వాళ్ల పరిస్థితే అలా ఉంటే రాజశేఖర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఒక దశలో అడ్రస్ లేకుండా పోయిన ఆయన ‘గరుడవేగ’తో కొంచెం పుంజుకున్నాడు. తర్వాత ‘కల్కి’తో ఎదురు దెబ్బ తిన్నాడు. ఈ రెండు చిత్రాల్లో నటించింది ఫాంలో లేని హీరోయిన్లే. ఇప్పుడు రాజశేఖర్.. నీలకంఠ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామందిని ట్రై చేశారట. మీడియం రేంజ్ హీరోయిన్లు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదట.

అసలే రాజశేఖర్, పైగా ఫాంలో లేని నీలకంఠ దర్శకుడు కావడంతో కాస్త పేరున్న హీరోయిన్లెవరూ ఆసక్తి చూపించలేదట. చివరికి అప్పుడెప్పుడో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’లో కథానాయికగా నటించిన రిచా పనాయ్‌ను తీసుకున్నారట. ఈమె గత మూణ్నాలుగేళ్లలో ఏ తెలుగు సినిమా చేసినట్లుగా లేదు. ఆ పేరునే అంతా మరిచిపోయారు. అలాంటమ్మాయిని రాజశేఖర్ పక్కన కథానాయికగా తీసుకోవడం వల్ల సినిమాకు ఏం ప్రయోజనం కలుగుతుందో?