అల్లరోడి నుంచి ఒక ప్రామిసింగ్ మూవీ

టాలీవుడ్లో ఇండస్ట్రీ జనాలే కాక ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడే హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు అతను కామెడీ సినిమాలతో అంతగా నవ్వించాడు మరి. అంతే కాక తన ప్రవర్తన కూడా చాలా హుందాగా ఉంటుంది. వివాదాలకు పూర్తి దూరంగా ఉంటాడు. అందుకే అతను అందరికీ ఇష్టుడు.

అల్లరోడు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంటే అందరూ బాధపడ్డవాళ్లే. తనకు ‘నాంది’ సినిమాతో మళ్లీ ఓ మంచి సక్సెస్ వస్తే అందరూ అంత సంతోషించారు కూడా. కానీ ఆ సక్సెస్‌ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా చివరి మూడు చిత్రాలూ నిరాశపరిచాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ‘బచ్చల మల్లి’ మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోలు బాగానే ఉన్నాయి.

ఐతే ‘బచ్చల మల్లి’ కంటే కూడా నరేష్ చేయబోయే కొత్త సినిమా ఇంకా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఆ చిత్రం శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే వెరైటీ థ్రిల్లర్ మూవీ తీసి మెప్పించిన మెహర్ తేజ్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.

నరేష్ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. పెద్ద బేనర్లలో తనకు ఛాన్సులు రావట్లేదు. సితార లాంటి బేనర్లకు ఉన్న గుడ్ విల్ వల్ల సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తారు. ‘ఫ్యామిలీ డ్రామ’ తీసిన దర్శకుడంటే నరేష్ నుంచి ఒక వెరైటీ సినిమాను కూడా ఆశించవచ్చు. కాబట్టి ఈ చిత్రంతో అల్లరోడి దశ తిరుగుతుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటించనుంది.