చిరు 157 అనుమానాలు తీరిపోయాయి

ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న చిరంజీవికి ఆ తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనే సందేహాలకు మెల్లగా స్పష్టత వస్తోంది. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ కాకపోయినా తనకో మంచి మూవీ ఇచ్చాడన్న అభిమానం దర్శకుడు మోహన్ రాజా మీద మెగాస్టార్ కు ఉంది. దాని రిలీజ్ టైంలో మరో అవకాశం ఇస్తానని కూడా అన్నారు. ఇప్పుడా దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. రచయిత బివిఎస్ రవి ఇచ్చిన కథను ప్రస్తుతం పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మలిచే పనిలో మోహన్ రాజా టీమ్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం తను జయం రవితో తని ఒరువన్ 2 పూర్తి చేసే హడావిడిలో ఉన్నాడు.

ఇది ఇంత బలంగా చెప్పడానికి కారణముంది. ఇటీవలే జనసేన పార్టీని విజయపథంలో నిలిపిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ మోహన్ రాజా ఫోటోలతో ఒక ట్వీట్ చేశాడు. అందులో చిరు, పవన్ ఇద్దరూ ఉన్నారు. దాన్నే బివిఎస్ రవి రీ ట్వీట్ చేస్తూ విష్ చేశారు. ఇద్దరూ చెప్పింది రాజకీయ శుభాకాంక్షలే అయినా ప్రాజెక్టు లైన్ లో ఉన్నందుకే వెంటనే స్పందించారనేది కాదనలేని వాస్తవం. లేకపోతే అదే పనిగా మోహన్ రాజా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి గ్రీటింగ్స్ చెప్పడుగా అనేది ఇంకో కామెంట్. ఏదైతేనేం మెగా 157 కు సంబంధించిన అడుగులు వేగంగా పడుతున్నాయి.

వినడానికి బాగానే ఉంది కానీ ఒరిజినల్ కథలు డీల్ చేసిన అనుభవం మోహన్ రాజాకు తక్కువ. ఒక్క తని ఒరువన్ ( ధృవ) మాత్రమే ఆయన మెప్పించిన స్ట్రెయిట్ సబ్జెక్టు. మిగిలినవన్నీ తమిళ, తెలుగు బ్లాక్ బస్టర్లన్నీ రీమేకులే. మరి చిరంజీవి ఆఫర్ ని ఎలా వాడుకుని తనను తాను ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. విశ్వంభర ఆగస్ట్ లోపే అయిపోతుందని సమాచారం. దర్శకుడు వశిష్ట చాలా వేగంగా తీస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ సమయం తీసుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసుకున్నాడు. ఇంకోవైపు చిరుకి కథలు చెప్పి ఒప్పించే ప్రయత్నంలో హరీష్ శంకర్, మారుతీ, అనుదీప్ తదితరులున్నారట.