ఎంఎస్ సుబ్బులక్ష్మిగా కీర్తి సురేష్ ?

మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

లెజెండరీ నటి జీవితాన్ని నాగ అశ్విన్ ఎంత గొప్పగా తెరకెక్కించాడో అంతకన్నా మిన్నగా ప్రాణం పోసిన కీర్తి సురేష్ కు అవార్డుల కన్నా ఎక్కువగా ప్రేక్షక లోకం నుంచి ప్రశంసలు దక్కాయి.

తిరిగి ఇంత గ్యాప్ తర్వాత మరో లెజెండరి బయోపిక్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ఎవరిదో కాదు. సుప్రసిద్ధ గాయని, వెంకటేశ్వర సుప్రభాతంతో ప్రతి ఇంటా కొలువుతీరిన ఎంఎస్ సుబ్బులక్ష్మిది.

ప్రస్తుతం ఆవిడ జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. నిర్మాణ సంస్థ, దర్శకుడు తదితర వివరాలు ఇంకా తెలియనప్పటికీ టైటిల్ రోల్ కీర్తి సురేష్ పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

సుబ్బులక్ష్మి జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి. మదురైలో ఒక మాములు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరులో చాలా మలుపులున్నాయి.

1997లో భర్త చనిపోయాక పాడటం ఆపేసిన ఈ అజరామర గాయని 2004లో కన్ను మూశారు. భక్తి పాటలతో ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేసే అనిర్వచనీయ మహత్తు ఆవిడ గాత్రంలో ఉండేది.

ఒకవేళ కీర్తి సురేష్ తో సాధ్యపడకపోతే నయనతార, త్రిష పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ప్రస్తుతానికి ఇంతకు మించిన వివరాలు లేవు. ఎంతసేపూ క్రికెటర్లు, రాజకీయ నాయకుల కథలనే తీస్తున్న మేకర్స్ ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీలను తెరకు పరిచయం చేయడం ద్వారా ఇప్పటి తరానికి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిన వారవుతారు.

పేరుకి సుబ్బులక్ష్మి తమిళనాడుకి చెందిన వారే అయినా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ఆవిడకు లక్షల్లో అభిమానులు ఉండేవారు. ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. అలాంటి మహనీయురాలి గాథను తెరపై చూడటం అవసరమే.