వెంకీ.. సంక్రాంతికి వస్తున్నాం

Hero Venkatesh Slow Down In Accepting Movies
Hero Venkatesh

ఈ ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్’తో గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ 75వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో వెంకీ కొంచెం డీలా పడి గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడాయన తనతో ‘ఎఫ్-2’; ‘ఎఫ్-3’ సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, దిల్ రాజు‌లతో మళ్లీ జట్టు కట్టబోతున్నారు. ఈ సినిమా గురించి కొన్ని రోజుల ముందే అనౌన్స్‌మెంట్ వచ్చింది. త్వరలోనే చిత్రీకరణ కూడా మొదలు కాబోతోంది.

ఈ సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ పెట్టినట్లు తాజా సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఈ సినిమా పేరట. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయాన్ని ముందే ప్రకటించారు. ఇప్పుడు టైటిల్ కూడా దానికి రిలేట్ అయ్యేలానే పెడుతున్నారట.

మామూలుగా అక్కినేని నాగార్జున సంక్రాంతికి సినిమాలను షెడ్యూల్ చేసి.. సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం అని చెబుతుంటారు. ఐతే ఇప్పుడు సినిమాకు టైటిల్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెడుతుండడం విశేషమే. ఇలాంటి టైటిల్ పెట్టి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే పబ్లిసిటీ పరంగా బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఫ్యామిలీస్‌ను బాగా ఆకర్షించే టైటిల్ అవుతుందిది. ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’లతో పోలిస్తే ఈ సినిమా డిఫరెంటుగా ఉంటుందని అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఇందులో వెంకీ సరసన ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు. అందులో ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి ఓకే అయింది. ఇంకో హీరోయిన్ కోసం వేట సాగుతోంది. ‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. జూన్ లేదా జులైలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.