ఏప్రిల్ చివరి వారం గంగపాలు చేశారు

ఏ భాషా పరిశ్రమకైనా సమ్మర్ సీజన్ చాలా కీలకం. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా సరే జనం ఆహ్లాదం కోసం ప్రాధాన్యత ఇచ్చేవి రెండే. ఒకటి సినిమాలు. రెండోది పార్కులు, షాపింగులు. టాలీవుడ్ ఇలాంటి కీలక సమయంతో నిర్లిప్తంగా ఉండటం థియేటర్ల ఫీడింగ్ ని దారుణంగా దెబ్బ తీస్తోంది. సరైన ప్లానింగ్ లేక మంచి రిలీజ్ డేట్స్ ని గాలికి వదిలేసి చేతులారా వసూళ్లను పోగొట్టుకుంటోంది. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ కేవలం ఒకటే ఉండటం ఆశనిపాతమే. నారా రోహిత్ ప్రతినిధి 2 అనూహ్యంగా వాయిదా పడటంతో కేవలం విశాల్ రత్నం ఒకటే సోలోగా బరిలో నిలిచినట్టు అయ్యింది.

అలా అని దీని మీద భారీ బజ్ ఉందా అంటే అదీ లేదు. మాస్ కంటెంట్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పందెం కోడి టైపు కమర్షియల్ ఎలిమెంట్స్, హరి దర్శకత్వం ఇవేవి హైప్ తీసుకురావడం లేదు. తమిళనాడులో ప్రమోషన్లు ఉదృతంగా చేశారు కానీ ఇక్కడ మాత్రం అంతగా పని జరగడం లేదు. ఒకవేళ టాక్ బాగుంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ప్రేక్షకులు ఆటోమేటిక్ గా దీన్నే చూస్తారు కానీ బలమైన కంటెంట్ ఉన్న స్ట్రెయిట్ మూవీ ఏదైనా ఉంటే ఆ కథ వేరుగా ఉండేది. స్కూళ్ళు, కాలేజీలు అందరికీ వేసవి సెలవులు ఇచ్చేశారు. సినిమాకెళదామంటే కొత్త బొమ్మలు ఎక్కడున్నాయి మరి.

రావాల్సిన లవ్ మీ ఇఫ్ యు డేర్, లవ్ మౌళి, శశివదనే లాంటివి మేకి షిఫ్ట్ అయ్యాయి. టిల్లు స్క్వేర్ తర్వాత జోష్ ఇచ్చిన మూవీ ఒక్కటి లేదు. ఐపీఎల్, ఏపీ ఎన్నికలంటూ నిర్మాతలు అనవసరంగా భయపడుతున్నారు కానీ హిట్ అనిపించుకునే సినిమా వస్తే జనం రారు అనే సమస్యే లేదు. కదలకుండా క్రికెట్ మ్యాచులు చూస్తున్నవాళ్ళు, రాజకీయ పార్టీల వెంట మండుటెండల్లో ర్యాలీలో తిరుగుతున్న వాళ్ళు సేదతీరాలంటే అసలంటూ థియేటర్లకు వెళ్లే ఆసక్తి పుట్టించాలిగా. ఈ రకంగా ఏప్రిల్ 26 గంగపాలైనట్టే. మల్లెమొగ్గ, సీతాకల్యాణ వైభోగమే, రుద్రాక్షపురంలున్నాయి కానీ ప్రేక్షకులకు కనీసం తెలిసే సూచనలు లేవు.