బాలీవుడ్ స్కెచ్ వేస్తున్న ప్రశాంత్ వర్మ

జాంబీ రెడ్డి చూశాక ప్రశాంత్ వర్మ దేశం మొత్తం మ్రోగిపోయే బ్లాక్ బస్టర్ ని అతి దగ్గరలో ఇస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారంని దాటేసి మరీ హనుమాన్ వసూళ్ల వర్షం కురిపించడం ఎప్పటికీ మర్చిపోలేని చరిత్రగా మిగిలిపోతుంది. కొత్త ఏడాది నాలుగో నెలలో అడుగు పెడుతున్నా దాన్ని దాటే ఇండస్ట్రీ హిట్ ఇంకా రాలేదంటే ఇంతకన్నా విజయానికి నిదర్శనం ఏముంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ తో సహా ఏ వివరాలు బయటికి చెప్పకుండా గుట్టు మైంటైన్ చేస్తున్నాడు.

కాసేపు దీని సంగతి పక్కనపెడితే ప్రశాంత్ వర్మ భారీ ఎత్తున బాలీవుడ్ స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నట్టు ముంబై టాక్. హనుమాన్ చూశాక ఇతని పనితనం విపరీతంగా నచ్చేసిన రణ్వీర్ సింగ్ వీలైనంత త్వరగా ఒక ప్యాన్ ఇండియా మూవీ చేద్దామని కబురు పెట్టాడట. పద్మావత్ చూసినప్పటి నుంచి రణ్వీర్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన ప్రశాంత్ వర్మ అతని రేంజ్ కు అనుగుణంగా ఒక మైథలాజికల్ సబ్జెక్టుని చెప్పాడట. ప్రస్తుతం లైన్ ఓకే అయ్యింది కానీ ఫుల్ వెర్షన్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోగా నిర్మాణ సంస్థలను సెట్ చేసుకునే పనిని ఇద్దరూ చూస్తున్నారని తెలిసింది.

ఇప్పటికే రెండు మూడు దఫాలు ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సింగ్ ల మధ్య చర్చలు జరిగాయట. జీ స్టూడియోస్, పెన్, జియోతో పాటు పలు కంపెనీల వద్దకు ఆల్రెడీ ప్రతిపాదనలు వెళ్లినట్టు వినికిడి. కార్యరూపం దాలిస్తే మాత్రం రచ్చ మాములుగా ఉండదు. అవకాశం వస్తే అవతార్ లాంటి సినిమా తీసి చూపిస్తానని ఆ మధ్య చెప్పి ట్రోలింగ్ కు గురైన ప్రశాంత్ వర్మ తర్వాత హనుమాన్ విజయంతో అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేశాడు. జై హనుమాన్ లో తేజ సజ్జతో పాటు ఇంకో పెద్ద హీరో ఉంటాడనే లీక్ ఉంది కానీ అదెవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. రణ్వీర్ సింగ్ అయితే కాదట.