పాపం ‘యోధ’ ఇలా ఉన్నాడేంటి

గత వారం అజయ్ దేవగన్ షైతాన్ కు మిక్స్డ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా ఆడియన్స్ నుంచి మద్దతు దక్కించుకుంది. ఒక సీరియస్ హారర్ సినిమా మొదటి వారంలో ఎనభై కోట్ల మార్కు చేరుకోవడం చిన్న విషయం కాదు. అయితే మాస్, ఫ్యామిలీస్ దీనికి దూరంగా ఉన్నాయి. అందుకే నిన్న సిద్దార్థ్ మల్హోత్రా యోధ మీద బయ్యర్లు చెప్పుకోదగ్గ అంచనాలు పెట్టుకుని ఎదురు చూశారు. టాలీవుడ్ భామ రాశిఖన్నా హీరోయిన్ కాగా రాబోయే కల్కిలో ప్రభాస్ సరసన మెరవబోతున్న దిశా పటాని తళుక్కున మెరిసింది. అయితే యోధ ఎక్కిన గాల్లోనే కూలిపోయిందని బాలీవుడ్ టాక్. అదేంటో చూద్దాం.

కథ మరీ కొత్తదేం కాదు. టాస్క్ ఫోర్స్ కమాండర్ గా ఉన్న అరుణ్ కటియాల్(సిద్దార్థ్ మల్హోత్రా)ది దూకుడుగా వెళ్లే మనస్తత్వం. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసే భార్య ప్రియంవద(రాశిఖన్నా)తో చక్కని ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఉగ్రవాదుల మిషన్ వల్ల అరుణ్ చేసిన పొరపాటుకి ఒక సైంటిస్ట్ మరణించడంతో పదవిని వదిలి ఎయిర్ కమెండోగా ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమానం ఎక్కుతాడు. అయితే ఇతన్నే టార్గెట్ చేసుకుని భారత ప్రభుత్వం దగ్గర డిమాండ్లు తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్న టెర్రరిస్టులు ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు. ఆ తర్వాత యోధుడు ఏం చేసి ఉంటాడనేది ఈజీగా ఊహించుకోవచ్చు.

సాగర్ అంబ్రే – పుష్కర్ ఓఝూ సంయుక్తంగా దర్శకత్వం వహించిన యోధలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ మినహాయించి మిగిలినదంతా సాదాసీదాగా జరిగిపోవడంతో ప్రత్యేకమైన థ్రిల్ అంటూ ఏమీ ఉండదు. సిద్దార్థ్ రాశిఖన్నాల ట్రాక్ రొటీన్ గా జరిగిపోగా ఫైట్లు చేసే క్యారెక్టర్ లో దిశాపటాని స్పెషల్ సర్ప్రైజ్ గా నిలుస్తుంది. నాగార్జున గగనం తరహా బ్యాక్ డ్రాప్ తీసుకున్నా హై టెన్షన్ థ్రిల్స్ ఇవ్వాలనుకున్న సాగర్ పుష్కర్ లు కథనాన్ని అంత బిగిగా రాసుకోకపోవడంతో సెకండ్ హాఫ్ మొత్తం ఊహించేలా సాగటం మైనస్. మొదటి వీకెండ్ కే వన్ ప్లస్ వన్ టికెట్ల ఆఫర్ పెట్టారంటేనే ఫలితం గురించి వేరే చెప్పాలా.