గెట్ రెడీ.. ఆర్ఎక్స్ 100 సీక్వెల్

పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘ఆర్ఎక్స్ 100’ ఒకటి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రెండు కోట్ల దాకా పెట్టుబడి పెడితే 15 రెట్ల దాకా ఆదాయం వచ్చింది. ఈ సినిమాతో అజయ్ పేరు మార్మోగిపోయింది.

కార్తికేయ, పాయల్ వరుసగా అవకాశాలు అందుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అజయ్ రెండో సినిమా ఆలస్యం జరిగింది కానీ.. అతడికి డిమాండేమీ తక్కువగా లేదు. ‘మహాసముద్రం’ పేరుతో అజయ్ తన రెండో సినిమా తీయనుండగా.. ఆ కథ కొన్ని చేతులు మారి చివరికి శర్వానంద్ చేతిలో పడింది. అనిల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుందని. లాక్ డౌన్ తర్వాత సినిమా పట్టాలెక్కవచ్చని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. ‘మహాసముద్రం’ మొదలు కావడానికి ముందే అజయ్ తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తన మూడో సినిమా ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ కావచ్చని అతను సంకేతాలిచ్చాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో లైవ్ చాట్ చేసిన అజయ్.. ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్‌కు కథ రెడీ చేసినట్లు చెప్పాడు. ఈ కథ కూడా కార్తికేయకు బాగానే సూటవుతుందని అన్నాడు. తన రెండో సినిమా పూర్తయ్యాక ఈ చిత్రం ఉండొచ్చని సంకేతాలిచ్చాడు.

ఐతే కార్తికేయతోనే ఈ సినిమా తీస్తాడా.. నిర్మాత ఎవరు అనే విషయాలు అతను ఖరారు చేయలేదు. తన జీవిత అనుభవాల నేపథ్యంలోనే అజయ్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. తనను ప్రేమ పేరుతో మోసం చేసిన అమ్మాయి మీద ప్రతీకారంతో ఈ కథ రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో పాత్రకు మాత్రం తన మిత్రుడి లైఫ్ స్టైల్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పాడు.