రవితేజ ‘ఈగల్’కు పోతురాజు కనెక్షన్

మాస్ మహారాజా రవితేజ ఈగల్ జనవరి 13 విడుదలకు రెడీ అయిపోయింది. విపరీతమైన పోటీ ఉన్నా సరే నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెనక్కు తగ్గే ఆలోచనే లేదంటూ పదే పదే స్పష్టం చేస్తున్న వైనం చూస్తున్నాం. మెల్లగా ప్రమోషన్లు ఉదృతం చేస్తున్నారు. నిజానికి మాస్ ఆడియన్స్ పరంగా చూసుకుంటే గుంటూరు కారం, నా సామి రంగ లాంటి పక్కా కమర్షియల్ కంటెంట్ ముందు ఈగల్ తరహా యాక్షన్ డ్రామా ఎలా నెగ్గుకొస్తుందనే అనుమానం ఆడియన్స్ లో లేకపోలేదు. దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు కం ఎడిటర్ కార్తీక్ ఘట్టమనేని.

ఈ సందర్భంగా కమల్ హాసన్ పోతురాజు కనెక్షన్ తీసుకొచ్చాడు. విరుమాండి పేరుతో తమిళంలో 2004లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ లోకనాయకుడు స్వీయ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో టిపికల్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే మూడు ప్రధాన పాత్రల మధ్య జరిగే ఒకే సంఘటనను వారి వారి కోణంలో విడివిడిగా చెప్పించి తద్వారా ఎవరు తప్పో ఎవరు ఒప్పో అంత సులభంగా అర్థం చేసుకోలేని కన్ఫ్యూజన్ తో ప్రేక్షకుల తెలివికి పరీక్ష పెట్టడం. క్లాసిక్ గా చెప్పుకునే మణిరత్నం యువలోనూ ఈ తరహా కథనం చూడొచ్చు. ఈగల్ లో ఈ టైపు నెరేషన్ ని ఎంచుకున్నారట.

ఈగల్ క్యారెక్టర్ల మధ్య పాయింట్ అఫ్ వ్యూ(చూసే దృక్పథం)ని అనూహ్యంగా మార్చడం ద్వారా ఒక సరికొత్త అనుభూతి దక్కుతుందని కార్తీక్ చెబుతున్నాడు. రవితేజ మాస్ ని మిస్ చేయకుండానే ఈ ప్రయోగాన్ని విజయవంతంగా తెరకెక్కించామని నమ్మకంగా చెబుతున్నాడు. ట్రైలర్ లో అసలు స్టోరీ లీక్ కాకుండా జాగ్రత్తగా కట్ చేసిన విధానం ఆసక్తిని పెంచింది. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జలతో పోటీకి సిద్ధపడిన ఈగల్ భారమంతా యాక్షన్ బ్యాక్ డ్రాప్ మీదే ఉంది. డార్క్ కామెడీ కూడా జొప్పించారట. అదే రోజు సైంధవ్‌ తో ఫేస్ టు ఫేస్ క్లాష్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.