బూరెల బుట్టలో పడ్డ గోపిచంద్ మలినేని

ఎక్కడో సుడి ఉంటే నేరుగా బూరెల బుట్టలో పడినట్టు ఉంది దర్శకుడు గోపిచంద్ మలినేని పరిస్థితి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న రవితేజ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఇష్యూస్ వల్లే వాయిదా వేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక వార్త రాలేదు. సరే ఇప్పుడు మాస్ మహారాజా స్థానంలో ఇంకో సీనియర్ హీరోతో తీయాలనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే ఇదే ప్రాజెక్టు తమిళ స్టార్ హీరో అజిత్ తో తీసే అవకాశం బలంగా ఉందని ఇన్ సైడ్ టాక్.

నిజానికి మైత్రికి అజిత్ ఓ కమిట్ మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అది మార్క్ ఆంటోనీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ అనేది నిన్నటి దాకా వినిపించిన చెన్నై టాక్. అనూహ్యంగా ఇప్పుడు గోపిచంద్ మలినేని పేరు తెరపైకి వచ్చింది. చాలా పవర్ ఫుల్ కథ తయారు చేశారని, అయితే ఇది మీడియం రేంజ్ హీరోతోనో లేదా తక్కువ వయసున్న హీరోతో చేస్తే వర్కౌట్ కాదనే ఉద్దేశంతో అజిత్ కి చెప్పి ప్రాధమికంగా ఓకే చేయించుకున్నారని వినికిడి. మరి అధిక్ రవిచంద్రన్ ది ఏమైంది అంటే వేరే సంస్థలో తర్వాత ఇంకెప్పుడైనా ఈ కలయిక ఉండొచ్చట. 

ఇది కార్యరూపం దాలిస్తే మలినేని పెద్ద జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే రవితేజది మిస్ కావడం వల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే తనతో ఆల్రెడీ మూడు బ్లాక్ బస్టర్లున్నాయి. డాన్ శీను, బలుపు, క్రాక్ తో ఓటమి లేని కాంబినేషన్ అందుకున్నాడు. సో అజిత్ తో చేయడం వల్ల కొత్త మార్కెట్ ఏర్పడుతుంది. సరిగ్గా హిట్టు కొడితే ఇతర కోలీవుడ్ స్టార్ల నుంచి పిలుపు అందుకోవచ్చు. కాకపోతే వారసుడు విషయంలో వంశీ పైడిపల్లి చేసిన పొరపాట్లు లాంటివి రాకుండా చూసుకోవాలి. అఫీషియల్ అయ్యేదాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ మైత్రి నిర్మాతలు మాత్రం దీని మీద సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు.