బాలయ్య వెర్సస్ రవితేజ.. ఈసారి కథ మారింది

నందమూరి బాలకృష్ణ, రవితేజల మధ్య చాలా ఏళ్లుగా ఆసక్తికర బాక్సాఫీస్ సమరం నడుస్తోంది. వీళ్లిద్దరిలో బాలయ్య రేంజే ఎక్కువ. మొదట్నుంచి బాలయ్య టాప్ స్టార్లలో ఒకడు. రవితేజ హీరో కావడానికి ముందే బాలయ్య మెగా హిట్లు ఇచ్చాడు. కానీ మొదట్లో క్యారెక్టర్ రోల్స్ చేసి.. ఆ తర్వాత హీరోగా మారి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ.. బాలయ్య మీద బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ చూపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

వీళ్లిద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు నడిచిన ప్రతిసారీ మాస్ రాజాదే పైచేయి కావడం విశేషం. 2008 సంక్రాంతికి బాలయ్య ‘ఒక్కమగాడు’, రవితేజ ‘కృష్ణ’ రిలీజ్ కాగా.. వీటిలో బాలయ్య మూవీ డిజాస్టర్ అయింది. రవితేజ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2011లో ‘పరమవీరచక్ర’; ‘మిరపకాయ్’ పోటీ పడ్డాయి. అప్పుడు కూడా రవితేజ. సినిమా స్పష్టమైన పైచేయి సాధించింది.

మధ్యలో మిత్రుడు, కిక్ కొంచెం గ్యాప్‌లో రిలీజైతే బాలయ్య సినిమా అప్పుడు కూడా డిజాస్టరే అయింది. రవితేజ మూవీ సక్సెస్ అయింది. దీంతో ఈసారి దసరాకి బాలయ్య, రవితేజల పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారా అని అందరూ ఆసక్తిగా చూశారు. సెంటిమెంట్ వర్కవుట్ అయితే మరోసారి రవితేజ విన్నర్ అవుతాడేమో అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం కథ మారింది. బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హిట్ దిశగా అడుగులు వేస్తోంది. రవితేజ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’కు మాత్రం నెగెటివ్ టాక్ వచ్చింది.

బాలయ్య సినిమా తొలి రెండు రోజుల్లో ఓ మోస్తరు వసూళ్లే సాధించినప్పటికీ.. షో షోకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వీకెండ్లో, మొత్తంగా దసరా సీజన్లో ఈ సినిమా పైచేయి సాధించడం.. సీజన్ విన్నర్‌గా నిలవడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ‘టైగర్ నాగేశ్వరరావు’కు తొలి రోజే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఈ సినిమా వీకెండ్ తర్వాత నిలబడే అవకాశాలు తక్కువే. మొత్తానికి ఎట్టకేలకు బాక్సాఫీస్ దగ్గర బాలయ్య.. రవితేజపై పైచేయి సాధిస్తున్నాడన్నమాట.