ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం దక్కేది. అందుకే ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా ఎవరూ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించలేకపోయారు. అర్హత ఉన్న చిత్రాలను సైతం ఒకప్పటి జ్యురీ సభ్యులు పక్కనపెట్టేవారు. అలాంటిదిప్పుడు కమర్షియల్ మూవీస్ కి దక్కుతున్న ప్రాధాన్యం సీనియర్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పుష్ప విషయంలో ఇది బాగా డిస్కషన్ లోకి వచ్చింది.

తాజాగా రాయన్ మీద కూడా అలాంటి డిబేట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ ఫార్ములాతో రూపొందిన ఒక మాఫియా రివెంజ్ డ్రామాని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనేది ఎంతో మంది లేవనెత్తుతున్న ప్రశ్న. కార్తీ సత్యం సుందరం లాంటివి కనపడలేదా అని నేరుగానే సోషల్ మీడియాలో నిలదీశారు. తాజాగా ధనుష్ దీని గురించి స్పందించాడు. ఆ సంవత్సరంలో రాయన్ కన్నా మంచి సినిమాలు చాలా వచ్చాయని ఎలాంటి భేషజం లేకుండా నిజాయితీగా ఒప్పుకున్నాడు.

అయితే గతంలో కర్ణన్, మరియన్, 3, వడ చెన్నై, పుదుపేట్టై, అసురన్, రాంఝానా వచ్చినప్పుడు తనకు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది చెప్పారని, అప్పుడు నిరాశ కలిగిందని, కానీ ఇప్పుడు రాయన్ కు దక్కి మిగిలిన వాళ్లకు రాకపోవడం పట్ల ఇలాంటి రియాక్షన్లు ఉండటం సహజమని వివరించాడు. నిజమే కదా. రాయన్ కన్నా బెస్ట్ మూవీస్ ముమ్మాటికీ వచ్చాయి. కానీ దీన్నే ఎందుకు ప్రత్యేకంగా పరిగణించారనే దానికి సమాధానం దొరకడం కష్టం.

రాబోయే సంవత్సరాల్లో దీని గురించి మరింత విశ్లేషణలు జరగడం ఖాయం. ఈ ఏడాది అయిపోక ముందే దురంధర్ లో రణ్వీర్ సింగ్ కు వస్తుందా లేక పెద్దిలో రామ్ చరణ్ కి ఇస్తారా అంటూ ఏవేవో ఊహాగానాలు మొదలుపెట్టేశారు. రాబోయే ఆరు నెలల్లో ఇంకా ఏమేం సినిమాలు వస్తాయో, వాటిలో ఆర్టిస్టులు ఎలా చేస్తారో తెలియక ముందే స్పెక్యులేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇకపై ఇదో ప్రహసనంలా కొనసాగుతుంది తప్ప బ్రేకులు పడటం, ఎవరో ఒకరు ఆపేయడం జరగని పని.