నాని ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నారా

మొన్న ప్రకటించిన జాతీయ అవార్డుల మీద రకరకాల డిబేట్లు సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. న్యాయాన్యాయాల సంగతి పక్కన పెడితే అన్ని వర్గాలను సంతృప్తి పరిచడం ఏ కాలంలోనూ జరగని పని. అయితే జై భీమ్ మీద కాస్తే ఎక్కువ చర్చ నడుస్తున్న విషయం గమనిస్తూనే ఉన్నాం. న్యాచురల్ స్టార్ నాని తన ఇన్స్ టా స్టోరీలో ఈ సినిమాకు పురస్కారం దక్కకపోవడం పట్ల తన హృదయం బాధ పడిందని అర్థం వచ్చేలా పెట్టిన చిన్న ఎమోజి పెద్ద అర్థానికే దారి తీసింది. మనకు వచ్చినందుకు గర్వపడకుండా కోలీవుడ్ మూవీకి రాలేదని బాధ పడటం ఏమిటని కొందరు నెటిజెన్లు నిలదీశారు.

నిజానికి నాని ఉద్దేశాన్ని అంత తీవ్ర అర్థంలో చూసే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా నచ్చితే ఏ సినిమా అయినా నెత్తినబెట్టుకునే సినిమా ప్రేమికులు తెలుగు వాళ్ళు. మనమూ తమిళులలాగా పక్క బాషల డబ్బింగ్ చిత్రాలను చులకనగా చూస్తే జైలర్ అంత భారీ వసూళ్లు రాబట్టేదా. కెజిఎఫ్, కాంతారలకు సింహాసనం దక్కేదా. లేదు కదా. సో నాని అనే కాదు సగటు ప్రేక్షకులుగా ప్రతి ఒక్కరం సినిమా అనే మాధ్యమాన్ని స్ట్రెయిట్, అనువాదం అనే భేదాలు లేకుండా ఆదరిస్తూనే ఉన్నాం. అలాంటపుడు ఏ అభిప్రాయమైనా వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందిగా.

సో అనవసరంగా నాని ఒక్కడినే అనడం వల్ల వ్యక్తిగత ప్రయోజనం తప్ప వచ్చేదేముందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అవార్డు గ్రహీతలను ట్వీట్ ద్వారా విష్ చేసిన నాని అందరికీ కలిపి శుభాకాంక్షలు చెప్పడం కూడా బన్నీ అభిమానులు కొందరు ఎత్తి చూపుతున్నారు. అయినా పొద్దుపోని వ్యవహారం కాకపోతే సంతోషంగా గర్వంగా ఫీలవ్వాల్సిన ఇలాంటి టైంలో ట్విట్టర్, ఫేస్ బుక్ చేతిలో ఉంది కదాని ప్రతిదానికి శల్యపరీక్ష చేయడం కూడా కరెక్ట్ కాదు. అసలు శ్యామ్ సింగ రాయ్ గురించి ప్రస్తావించకుండా నాని జై భీం గురించే చెప్పాడంటే ఆ సినిమాకు తగిన గుర్తింపు రాలేదనేగా.