ప్రభాస్-మారుతి.. ఒకటే.. రెండు కాదు

‘బాహుబలి’ ఒక్క సినిమాగా మొదలై రెండుగా మారడం.. రెండు భాగాలూ అద్భుత ఫలితాన్ని అందుకుని ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో చాలామందికి ఈ 2 పార్ట్ మూవీస్ మీద ఆసక్తి పెరిగిపోయింది. పుష్ప సినిమాను కూడా ఇలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి రెండుగా మార్చారు. అక్కడ కూడా బాగానే వర్కవుట్ అయింది. కేజీఎఫ్ సినిమాను ముందు నుంచే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. రిజల్ట్ గురించి తెలిసిందే.

దీంతో కొత్తగా ఏ పెద్ద సినిమా మొదలైనా.. రెండు భాగాల చర్చ వస్తోంది. కానీ ఇలా ట్రై చేసి దెబ్బ తిన్న సినిమాలు కూడా లేకపోలేదు. ‘యన్.టి.ఆర్’ సినిమాను రెండు భాగాలు చేస్తే మొదటి భాగమే తేడా కొట్టేసి రెండో దాన్ని అస్సలు పట్టించుకోలేదు. కన్నడలో ‘కబ్జ’ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొత్త సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

ఆల్రెడీ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ చేస్తున్న ‘సలార్’ను రెండు భాగాలుగా తీసుకురానున్న విషయం ఖరారైంది. కాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్)ను కూడా 2 పార్ట్స్‌గా తెస్తారనే ప్రచారం జరుగుతోంది. అసలు మారుతితో ప్రభాస్ సినిమా అంటేనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మారుతి ఉన్న ఫాంలో తనతో సినిమా వద్దే వద్దని ఫ్యాన్స్ నానా గొడవ చేశారు. కానీ ప్రభాస్ అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.

ఐతే ఇప్పుడు ఈ సినిమాను రెండు భాగాలుగా అంటే అభిమానులు కచ్చితంగా గొడవ చేస్తారు. ఐతే ఈ ప్రచారం ఎలా మొదలైందో ఏమో కానీ.. ఈ వార్త నిజం కాదన్నది చిత్ర వర్గాల సమాచారం. ఈ కథను కొనసాగించే ఛాన్స్ ఉన్నప్పటికీ.. రెండు భాగాలు అన్నది ఖాయం కాదట. సినిమా పూర్తి చేసి రెండో భాగం తీసేందుకు హింట్ మాత్రం ఇస్తారని.. రిజల్ట్‌ను, ప్రభాస్ వీలును బట్టి కథను రెడీ చేసుకుని ఇంకో సినిమా చేస్తారే తప్ప.. ఇప్పుడే సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న నిర్ణయం ఏమీ జరగలేదని సమాచారం.