సీతారామం-2కు ద‌ర్శకేంద్రుడి స్టోరీ లైన్

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో వ‌చ్చిన ఉత్త‌మ ప్రేమ‌క‌థ‌ల్లో సీతారామం ఒక‌టి. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ ల‌వ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ప్రేక్ష‌కులు ఆ సినిమా చూసి క‌దిలిపోయారు.

ఫిలిం సెల‌బ్రెటీలు కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు. రాఘ‌వేంద్ర‌రావు లాంటి లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కూడా అందులో ఒక‌ర‌ని ఇప్పుడే తెలిసింది. సీతారామం త‌న‌కు ఎంతో న‌చ్చిన‌.. త‌న‌ను ఎమోష‌న‌ల్‌గా క‌దిలించిన సినిమా అని ఆయ‌న వైజ‌యంతీ వారి కొత్త చిత్రం అన్నీ మంచి శ‌కున‌ములేకు సంబంధించిన ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో వెల్ల‌డించారు. సీతారామం త‌ర్వాత వ‌స్తున్న ఈ చిత్రానికి అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని.. పెద్ద హిట్ట‌వుతుంద‌ని చెబుతూ.. సీతారామం చిత్రానికి సీక్వెల్ తీయాల‌ని ఆయ‌న నిర్మాత స్వ‌ప్న‌ను కోరారు.

సీతారామం సినిమాలో సీత ప‌రిస్థితి త‌లుచుకుంటే గుండె త‌రుక్కుపోతుందని.. ఆమెను అలా వ‌దిలేయ‌కుండా ఈ క‌థ‌ను పొడిగించి సీక్వెల్ తీయాల‌ని రాఘ‌వేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయ‌నే చెప్ప‌డం విశేషం. రామ్ చ‌నిపోయాడ‌న్న బాధ‌తో తుపాకీ తీసుకుని సీత విల‌న్ ద‌గ్గ‌రికి వెళ్తుంద‌ని.. అప్పుడు అత‌ను నీ రామ్ చ‌నిపోలేదంటూ ఒక గుహ‌లోకి తీసుకెళ్లి చూపిస్తాడని.. అక్క‌డి నుంచి రామ్‌ను విడిపించుకుని వ‌చ్చాక‌.. సీత కుటుంబ స‌భ్యులు వారిని వెంటాడుతార‌ని.. ఇలా ప్లాట్ పాయింట్ తీసుకుని సెకండ్ పార్ట్ తీయాల‌ని రాఘ‌వేంద్ర‌రావు కోరారు.

సీత గురించి ఇప్పుడు త‌లుచుకున్నా త‌న క‌ళ్లో నీళ్లు తిరుగుతాయ‌ని.. ఆమె క‌థ‌ను కొనసాగించాల‌ని.. త‌న‌కు న్యాయం చేయాల‌ని రాఘ‌వేంద్ర‌రావు చెప్ప‌గా.. స్వ‌ప్న‌, అల్లు అర‌వింద్ స‌హా అక్క‌డున్న‌ అంద‌రూ న‌వ్వేశారు.