మురుగదాస్ పెద్ద రిస్కే చేస్తున్నారు

గజినీ, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు మురగదాస్ తన స్థాయి సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. లేకలేక సూపర్ స్టార్ రజినీకాంత్ ఛాన్స్ ఇస్తే దర్బార్ ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేక యావరేజ్ గా నిలిచింది. ఒకవేళ అది హిటయ్యుంటే ఇవాళ కథ ఇంకోలా ఉండేది. సరే కొత్త ప్రాజెక్ట్ సెట్ అయ్యేదాకా ఖాళీగా ఉండటం ఎందుకని దాస్ నిర్మాతగా మారారు.

ఆయన భారీ బడ్జెట్ తో తీసిన ప్యాన్ ఇండియా మూవీ ఆగస్ట్ పదిహేను 1947 తమిళనాడులో ఏప్రిల్ 7న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాకు ఖర్చు ఎక్కువే అయ్యింది. అయితే దసరా జోరు, అదే రోజు రావణాసుర, మీటర్ ఉండటంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని ఒక వారం ఆలస్యంగా 14న తీసుకురాబోతున్నారు.

అప్పుడు కూడా శాకుంతలం, రుద్రుడు రేస్ లో ఉన్నప్పటికీ ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు. మణిరత్నం కడలితో పరిచయమైన గౌతమ్ కార్తిక్ ఇందులో హీరో. స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో భారతదేశంలో జరిగిన కొన్ని దారుణ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రయిలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది.

కానీ ఇలా వారం గ్యాప్ తీసుకోవడం వల్ల ఒరిజినల్ వెర్షన్ కు టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడి బిజినెస్ రిస్క్ లో పడుతుంది. ఠాగూర్ మధు, ఎన్వి ప్రసాద్ లాంటి అగ్ర డిస్ట్రిబ్యూటర్లు అండగా ఉన్నారు కాబట్టి సరిపడా థియేటర్లు దొరుకుతాయి కానీ ఆర్టిస్టులు పరిచయమే లేని ఆర్టిస్టుల సినిమాను మన జనానికి రీచ్ చేయడం చాలా కష్టం. మురుగదాస్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు మొదలుపెట్టారు. మీడియాకు ముందుగానే ప్రీమియర్లు వేయబోతున్నారు. మరి సమంతా, రవితేజ, కిరణ్ అబ్బవరం, లారెన్స్ ల కాంపిటీషన్ ని తట్టుకుని దాస్ తన సినిమాను ఎలా గెలిపిస్తారో చూడాలి.