ప‌ఠాన్ విధ్వంసానికి భ‌య‌ప‌డి వాయిదా

గ‌త ఏడాది కేజీఎఫ్‌-2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాగించిన బాక్సాఫీస్ విధ్వంసం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఐతే ఆ సినిమాను త‌క్కువ అంచ‌నా వేసి, జెర్సీ హిందీ రీమేక్‌ను కేజీఎఫ్‌-2 రిలీజైన వారానికే ధైర్యంగా రిలీజ్ చేశారు. అది కేజీఎఫ్‌-2 సునామీలో ప‌డి కొట్టుకుపోయింది. షాహిద్ కూడా పెద్ద స్టారే అని, జెర్సీ స్యూర్ షాట్ హిట్ అనే ధీమాతో మేక‌ర్స్ ధైర్యం చేశారు కానీ.. వాళ్లెంత పెద్ద త‌ప్పు చేశారో త‌ర్వాత కానీ అర్థం కాలేదు.

సినిమాను తొలి రోజు నుంచే జ‌నం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ఇలా ఓ సినిమా ప్ర‌భంజనం సృష్టిస్తున్న‌పుడు ఇగోకు పోకుండా వాయిదా వేసుకోవ‌డం ఉత్త‌మం అని అప్పుడు బాలీవుడ్ జ‌నాల‌కు బాగానే అర్థ‌మైన‌ట్లుంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీయే అయిన‌ ప‌ఠాన్ వారం రోజులుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సృష్టిస్తున్న సంచ‌ల‌నాల గురించి తెలిసిందే.

వీకెండ్లోనే 500 కోట్ల దాకా వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆ చిత్రం.. సోమ‌వారం కూడా బ‌లంగా నిల‌బ‌డింది. ఈ ఊపు చూశాక వ‌చ్చే నెల 10న రావాల్సిన కార్తీక్ ఆర్య‌న్ సినిమా షెజాదాను దాని మేక‌ర్స్ వాయిదా వేసేశారు. ఇంకా విడుద‌ల‌కు ప‌ది రోజుల‌కు పైగానే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ఠాన్ జోరు ఇప్ప‌ట్లో త‌గ్గ‌దేమో అని భ‌య‌ప‌డి త‌మ చిత్రాన్ని వారం ఆల‌స్యంగా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇప్పుడా చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న శివ‌రాత్రి వీకెండ్లో రిలీజ్ కాబోతోంది. కార్తీక్ గ‌త ఏడాది భూల్ భూల‌యియా-2తో పెద్ద హిట్టే కొట్టిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు షారుఖ్ సినిమా విధ్వంసం చూసి వెన‌క్కి త‌గ్గ‌డానికి వెనుకంజ వేయ‌లేదు. షెజాదా తెలుగు బ్లాక్‌బ‌స్టర్ అల వైకుంఠ‌పుర‌ములో రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కార్తీక్ స‌ర‌స‌న కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రానికి రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌కుడు.