వ‌కీల్ సాబ్‌కు త్రివిక్ర‌మ్ రాస్తాన‌న్నాడు కానీ..

Vakeel Saabb

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు ఉన్న అనుబంధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. జ‌ల్సాతో మొద‌లైన వీరి ప్ర‌యాణం సినిమాను దాటి ఎక్క‌డికో వెళ్లిపోయింది. వ్య‌క్తిగ‌తంగా ఇద్ద‌రూ ఆప్త మిత్రులు అయిపోయారు. ఆ సాన్నిహిత్యంతోనే త్రివిక్ర‌మ్‌తో మూడు సినిమాలు చేశాడు ప‌వ‌న్. అలాగే ప‌వ‌న్ న‌టించిన తీన్ మార్ సినిమాకు త్రివిక్ర‌మ్ స్క్రిప్టు రాశాడు. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి కొన్ని సినిమాల‌కు కూడా కొంత‌మేర‌ ర‌చ‌నా స‌హ‌కారం అందించాడు.

ప‌వ‌న్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విష‌యంలోనూ త్రివిక్రమ్ పాత్ర ఉంది. పింక్ సినిమాను ప‌వ‌న్‌తో రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని చెప్పి ఈ ప్రాజెక్టును సెట్ చేసింది త్రివిక్ర‌మే. అంతే కాదు.. ఈ సినిమాకు మాట‌లు కూడా రాయాల‌ని త్రివిక్ర‌మ్ అనుకున్నాడ‌ట‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ట‌.

ఈ విష‌యాన్ని వ‌కీల్ సాబ్ ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. తాను అస‌లు ప‌వ‌న్‌తో వ‌కీల్ సాబ్ సినిమా తీస్తాన‌ని అనుకోలేద‌ని.. తాను వేరే సినిమా స‌న్నాహాల్లో ఉండ‌గా నిర్మాత దిల్ రాజుతో క‌లిసి ఒక‌సారి త్రివిక్ర‌మ్‌ను క‌లిశాన‌ని.. అప్పుడు వాళ్లిద్ద‌రూ పింక్ రీమేక్ గురించి మాట్లాడుకున్నార‌ని.. అప్పుడు ఈ సినిమా అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందా అనుకున్నానని.. అనుకోకుండా ఆ అదృష్టం త‌న‌కే ద‌క్కింద‌ని వేణు తెలిపాడు.

ముందు ఈ చిత్రానికి మాట‌లు రాస్తాన‌ని త్రివిక్ర‌మ్ అన్నార‌ని.. కానీ ఆయన అల వైకుంఠ‌పుర‌ములో ప‌నుల్లో బిజీగా ఉండ‌టం, ఆయ‌న ఖాళీ అవ్వ‌క‌ముందే సినిమాను మొద‌లుపెట్టాల్సి ఉండ‌టంతో ఈ చిత్రానికి ప‌ని చేయ‌లేక‌పోయార‌ని వేణు తెలిపాడు. ప‌వ‌న్ అభిమాని అయిన తాను.. ఆయ‌న్ని డైరెక్ట్ చేస్తాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని వేణు అన్నాడు.