హిందీ ‘వైకుంఠపురం’.. డేట్ ఇచ్చి మొదలెట్టారు

తెలుగులో గత ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ సినిమా.. ‘రంగస్థలం’ వసూళ్లను దాటేసి నాన్ బాహుబలి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. హిందీ రీమేక్ గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రకటించారు.

ఈ చిత్రాన్ని హిందీ నిర్మాతల్లో తెలుగు వెర్షన్‌ను ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ కూడా ఉండటం విశేషం. వీరితో కలిసి భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అమన్ గిల్ ‘షెజాదా’ పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బుధవారమే సెట్స్ మీదికి వెళ్లింది. హీరోను యువరాజుగా సూచిస్తూ టైటిల్‌కు కిరీటాన్ని జోడించి.. ‘హి రిటర్న్స్ హోమ్’ అనే క్యాప్షన్‌తో టైటిల్ లోగోను కూడా ఈ సందర్భంగా రివీల్ చేశారు. అంతే కాదు.. సినిమాను మొదలుపెట్టిన రోజే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. 2022 నవంబరు 4న ‘షెజాదా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ చేసిన చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్ లాంటి అప్ కమింగ్ హీరోతో చేయించడం కొంత రుచించని విషయమే. ఐతే మంచి ఫాంలో ఉన్న కృతి సనన్ మాత్రం పూజా పాత్రకు బాగానే సూట్ కావచ్చు. తెలుగులో మురళీ శర్మ, టబు చేసిన పాత్రలను హిందీలో పరేష్ రావల్, మనీషా కొయిరాలా చేస్తున్నారు. హీరో తాతగా ఇక్కడ చేసిన పాత్రనే సచిన్ ఖేద్కర్ హిందీలోనూ చేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాలు వేరే భాషలకు వెళ్లినపుడు చాలా వరకు నిరాశ పరిచినవే. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తమిళంలో డిజాస్టర్ కావడం తెలిసిందే. మరి ‘అల వైకుంఠపురములో’ రీమేక్ హిందీలో ఏమేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.