‘మా’ పోలింగ్: ఆత్మీయ వాతావరణంలో మొదలై తొలిసారి ఉద్రిక్తత

పోటాపోటీగా సాగుతున్న ‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటలకు మొదలు కావటం తెలిసిందే. పోలింగ్ షురూ కావటానికి కొన్ని గంటల ముందు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం.. శనివారం రాత్రి వేళలోనూ రెండు ప్యానళ్ల వారు పోటాపోటీగా వీడియోలు విడుదల చేసుకోవటం తెలిసిందే. తమ మీద చేసిన ఆరోపణలకు కౌంటర్లు ఇచ్చుకున్న వైనంతో పోలింగ్ ఎలా మొదలవుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. అందుకు భిన్నంగా ఆదివారం ఉదయం మొదలైన పోలింగ్ ఆత్మీయ వాతావరణంలో మొదలైంది.

పోలింగ్ జరుగుతున్న కేంద్రం వద్దకు చేరుకున్న మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్ లు ఒకరికొకరు పలుకరించుకోవటం.. మోహన్ బాబును చూసినంతనే ప్రకాశ్ రాజ్ కాళ్లకు నమస్కారం పెట్టే ప్రయత్నంచేయటం.. దాన్ని అడ్డుకుంటూ మోహన్ బాబు ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం.. విష్ణుతో చేతులు కలిపించటం లాంటివి చోటుచేసుకున్నాయి. దీంతో.. ఇరు వర్గాల వారి మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది.

ఇక.. రెండు ప్యానళ్లకుచెందిన వారు సరదాగా మాట్లాడుకుంటూనే.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. ఓటు వేసిన వారిని ఇరు ప్యానళ్ల వారు ఆత్మీయంగా పలుకరించటం లాంటివి చేస్తుండటంతో పోలింగ్ ముందున్న ఉద్రిక్తత పోలింగ్ వేళ లేనట్లేనా? అన్న భావన కలిగింది. ఇదిలా ఉంటే..పోలింగ్ మొదలైన 45 నిమిషాలకు తొలిసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకోవటంతో ఇరువురి మధ్య మాటలు మొదలయ్యాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువురిని అక్కడి నుంచి పంపేశారు.
ఇదిలా ఉండగా.. ఓటు వేయటానికి వచ్చిన వారు అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. సాయి కుమార్ మాట్లాడుతూ.. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నానని.. కాకుంటే షూటింగ్ లు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదన్నారు. లోకల్.. నాన్ లోకల్ కాదు తాను నేషనలిస్టు అని చెప్పారు. మా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ‘మా’ గెలిచినట్లేనంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.