కోహ్లి-అనుష్కలకు తొలి బిడ్డ పుట్టింది

విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వారి కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చారు. అనుష్క సోమవారమే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ముంబయిలో ప్రసవం జరిగింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రసవ సమయంలో కోహ్లి భార్య పక్కనే ఉన్నట్లు తెలిసింది. తొలి బిడ్డ ప్రసవం నేపథ్యంలో కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే.

తొలి టెస్టు ఆడాక అతను జట్టుకు దూరమయ్యాడు. వెంటనే స్వదేశానికి చేరుకుని భార్యతో గడుపుతున్నాడు. తండ్రి అయ్యే క్షణాలను దగ్గరుండి ఆస్వాదించాలని, వాటిని జీవితాంతం పదిలపరుచుకోవాలని అతను భావించి ఉండొచ్చు. ముఖ్యమైన సిరీస్ మధ్యలో వదిలేయడంపై కొంత విమర్శలు వచ్చినా.. ఎక్కువ మంది అతడి నిర్ణయాన్ని స్వాగతించారు. భారత జట్టు సిడ్నీలో అద్భుత ప్రదర్శనతో మూడో టెస్టును డ్రాగా ముగించిన సమయంలోనే కోహ్లి తండ్రి కావడం విశేషం.

భారత క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమలో పడటం కొత్త కాదు. ఇలాంటి జంటలు రెండంకెల సంఖ్యలో ఉన్నాయి. ఆ కోవలోనే కోహ్లి, అనుష్కల ప్రేమ ఏడేళ్ల ముందు మొదలైంది. మధ్యలో కొన్ని నెలలు ఇద్దరూ విడిపోయి ఒకరికొకరు దూరంగా ఉన్నారు. అప్పుడు ఇద్దరి ప్రేమకథ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సెలబ్రెటేడ్ సెలబ్రెటీ కపుల్ వీరిదే అని చెప్పొచ్చు.

పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. కరోనా వల్ల లాక్ డౌన్ అమలుతో ఇంటి పట్టునే ఉన్నపుడు బిడ్డ గురించి ఆలోచించినట్లున్నారు. లాక్ డౌన్ టైంలోనే తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు ఆ జంట వెల్లడించింది. తర్వాత ఐపీఎల్ కోసం కోహ్లి యూఏఈకి వెళ్లగా.. అక్కడికి కూడా అనుష్క వెళ్లింది. నెలలు నిండడంతో తర్వాత స్వదేశానికి వచ్చేసింది. కోహ్లి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాడు. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ తర్వాత స్వదేశానికి వచ్చేశాడు.