జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ అసోసియేష‌న్లో ఏక‌ప‌క్షంగా ఉప ఎన్నిక‌ల‌కు ప్ర‌క‌ట‌న ఇచ్చిందంటూ సంఘం జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త మీద ఒక వ‌ర్గం ఆరోప‌ణ‌లు చేయ‌డం.. ఆ వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు, జానీ మాస్ట‌ర్‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డం తెలిసిందే.

ఐతే మెగాస్టార్ చిరంజీవి దృష్టికి ఈ విష‌యం వెళ్ల‌డంతో ఆయ‌న జోక్యం చేసుకోవ‌డంతో ఈ వివాదం స‌మ‌సిపోయిన‌ట్లే క‌నిపించింది. జానీ మాస్ట‌ర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి.. త‌మ మ‌ధ్య ఏ గొడ‌వ‌లూ లేవ‌ని.. అంత‌ర్గ‌తంగా అసోసియేష‌న్లో చిన్న స‌మ‌స్య అని.. దాంతో త‌న‌కు, శేఖ‌ర్‌కు సంబంధం లేద‌ని చెప్పాడు. అంత‌టితో ఈ వ్య‌వ‌హారానికి తెర‌ప‌డింద‌ని అనుకున్నారు.

కానీ రెబ‌ల్ వ‌ర్గంలో ఉన్న మ‌రో ఫేమ‌స్ డ్యాన్స్ మాస్ట‌ర్ దినేష్.. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో జానీ మాస్ట‌ర్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. జానీ స్థానిక డ్యాన్సర్ల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నాడ‌ని.. అత‌ను చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను సైతం మోసం చేశాడ‌ని దినేష్ ఆరోపించాడు. త‌న‌కు ఇల్లు లేక‌ అద్దె ఇంట్లో ఉంటున్నాన‌ని, బ్యాంక్ బ్యాలెన్స్ ల‌క్ష రూపాయ‌లే ఉంద‌ని చెప్పిన జానీ మాస్ట‌ర్.. డ్యాన్స‌ర్ల ఇన్సూరెన్స్ కోసం రూ.18 ల‌క్ష‌లు విరాళంగా ఎలా ఇచ్చాడ‌ని దినేష్ ప్ర‌శ్నించాడు.

ఒక స‌మ‌స్య త‌లెత్తిన‌పుడు దాన్ని మ‌రుగున ప‌రిచేందుకు జ‌రిగే ప్ర‌య‌త్నం ఇద‌ని అత‌న‌న్నాడు. జానీ మాస్ట‌ర్ తాను కంపోజ్ చేసే పాట‌ల‌కు లోక‌ల్ డ్యాన్స‌ర్ల‌ను పెట్టుకోడ‌ని, ముంబ‌యి నుంచే డ్యాన్స‌ర్ల‌ను తెప్పిస్తాడ‌ని.. ఇదంతా క‌మిష‌న్ కోస‌మే అని దినేష్ ఆరోపించాడు.

తెలుగు రాష్ట్రాల్లో వేల‌మంది డ్యాన్సర్లు ఉన్నార‌ని.. వాళ్లు ఒక రోజుకు రెండు మూడు వేలే తీసుకుంటార‌ని.. కానీ జానీ మాత్రం ముంబ‌యి నుంచి ఎంతో ఖ‌ర్చు పెట్టించి డ్యాన్స‌ర్ల‌ను తెప్పిస్తాడ‌ని.. వాళ్ల‌కు రోజు జీతం 7-8 వేలు అని లెక్క‌లు చూపిస్తార‌ని.. అందులో స‌గం క‌మిష‌న్ తీసుకుని మిగ‌తాది త‌న జేబుల్లో వేసుకుంటాడ‌ని.. లోక‌ల్ డ్యాన్స‌ర్ల‌ను పెట్టుకుంటే క‌మిష‌న్ రాద‌ని, ఇలా చేస్తార‌ని.. ఇది డ్యాన్స‌ర్ల‌తో పాటు నిర్మాత‌ల‌కూ న‌ష్టం చేకూర్చేదే అని దినేష్ అన్నాడు. ఇలాంటి వ్య‌వ‌హారాల‌పై ప్ర‌శ్నిస్తున్నందుకే అసోసియేష‌న్లో గొడ‌వ‌ల‌ని దినేష్ అన్నాడు.