అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన ముద్ర శాశ్వతంగా ఉండిపోయింది. ఇప్పటికీ టీవీలో ఏదైనా సినిమా వస్తోందంటే ఆలా కళ్ళు అప్పగించి చూసే అభిమానులు లక్షల్లో ఉంటారు. క్షణక్షణం తీసిన రామ్ గోపాల్ వర్మ సందర్భం దొరికిన ప్రతిసారి శ్రీదేవితో వర్క్ ఎక్స్ పీరియన్స్, ఆవిడ మీద తన ఫ్యానిజం గురించి కథలుగా చెబుతారు.

ఇక ఆసలు విషయానికి వస్తే టాలీవుడ్ కు సంబంధించి శ్రీదేవి సెంటిమెంట్ ఒకటి జాన్వీ కపూర్ కు ఏమేరకు కలిసి వస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదేంటంటే స్వర్గీయ ఎన్టీఆర్ బడిపంతులులో ఆయన మనవరాలిగా మెరిసిన శ్రీదేవి ఆ తర్వాత వేటగాడు, జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి బ్లాక్ బస్టర్స్ లో హీరోయిన్ గా నటించారు. రెండో తరంలో చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి క్లాసిక్ తో పాటు ఎస్పి పరశురామ్ లో నటించారు.

మొన్న ఏడాది ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ దేవరతో శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ తెలుగులో తెరంగేట్రం చేసింది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇప్పుడు చిరంజీవి వారసుడు రామ్ చరణ్ జోడిగా పెద్దిలో నటించింది. దీనికీ పాజిటివ్ వైబ్స్ చాలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది కూడా బ్లాక్ బస్టర్ అయితే నిన్నటి జనరేషన్ లో శ్రీదేవి, ఇప్పటి తరంలో జాన్వీ కపూర్ తమదైన ముద్ర వేసిన వాళ్ళుగా గుర్తుండిపోతారు. అల్లు అర్జున్ రాకాలో కూడా జాన్వీ ఉందనే టాక్ ఆల్రెడీ తిరుగుతోంది.

బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా జాన్వీకి టాప్ హీరోయిన్ అయ్యేందుకు సరిపడా బ్రేక్ దొరకడం లేదు. అందుకే ఇప్పుడు పెద్ది కనక వర్కౌట్ అయితే మెల్లగా ఇక్కడే సెటిలయ్యే అవకాశాలు పెంచుకోవచ్చు. ఎలాగూ స్టార్ హీరోల సరసన ఆఫర్లు అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. వాటిని కనక సద్వినియోగపరుచుకుంటే రెమ్యునరేషన్లు గట్టిగా ముడతాయి,. ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా పాల్గొన్న జాన్వీ కపూర్ ఢిల్లీ నుంచి విజయవాడ దాకా ఏ ఈవెంట్ ని మిస్ చేయలేదు.