రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. తాజాగా వారణాసికి సంబంధించి ఒక వాటర్ ఎపిసోడ్ తాలూకు విజువల్స్ కొన్ని బయటికి వచ్చాయనే వార్త బయటికి రావడంతో మహేష్ బాబు అభిమానులు అలెర్ట్ అయిపోయారు. గతంలో ఇదే తరహాలో మహేష్ బాబు – పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య ఒక కీలకమైన ఎపిసోడ్ కు సంబంధించిన క్లిప్పు వైరలైన సంగతి తెలిసిందే.

తర్వాత ఇప్పుడు మళ్ళీ గంగ నందిలో మహేష్ పడవ మీద వెళ్లే లాంగ్ విజువల్ చక్కర్లు కొడుతున్నట్టుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు కనపడుతున్నాయి. నిజానికి రాజమౌళి వీటి వల్ల ఆందోళన చెందే టైపు కాదు. ఎందుకంటే రా వీడియోలో మనం ఏదైతే చూస్తామో దానికి ఫైనల్ అవుట్ ఫుట్ కి నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉంటుంది. ఇదేమి కొత్త కాదు. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పులి వెంబడించే సీన్ షూటింగ్ టైంలోనే లీకయ్యింది. కానీ తీరా సినిమాలో చూశాక దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది.

బాహుబలి టైంలో ప్రభాస్, అనుష్క రాజ్యాల మధ్య ఒక వార్ ఎపిసోడ్ నుంచి చిన్న సీన్ ఇదే తరహాలో ఎడిటింగ్ రూమ్ కు వెళ్లకుండానే బయటికి వచ్చింది. అసలది సినిమాలో లేకుండా లేపేయడం రాజమౌళికి మాత్రమే సాధ్యమైన విద్య. సో ఇప్పుడు వారణాసి నుంచి వచ్చిన లీకులు స్పష్టంగా లేకపోవడం పక్కనపెడితే వాటి వల్ల ఏదో కొంపలు అంటుకుపోతాయనే రేంజ్ లో జక్కన్న టీమ్ ఆర్తనాదాలు పెట్టదు. కూల్ గా వాటిని తీయించేసి తన పని తాను చేసుకుంటుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మిస్ కాకుండా పక్కా ప్లానింగ్ తో ఉంది. ఈ సంవత్సరంలోనే షూటింగ్ పూర్తి చేసి మూడు నెలలు పూర్తిగా గ్లోబల్ ప్రమోషన్ మీద దృష్టి పెట్టబోతున్నారు రాజమౌళి. ఇప్పటిదాకా ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ తప్ప ఇతర ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో కూడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్న రాజమౌళి ఈసారి మాత్రం వాయిదాల ప్రసక్తే లేదంటున్నారు. కీరవాణి ప్రస్తుతం ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నారు.