రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు ధోరణిలో మాట్లాడారు. రివ్యూలు చాలా డ్యామేజ్ చేస్తున్నాయని, మరణ శాసనం రాస్తున్నాయని ఒకరంటే, ఒక ఆర్టిస్టు ఏకంగా నిర్మాత కోన వెంకట్ ని అడుగుతూ ఏంటి సార్ మీరు రివ్యూ రైటర్లను మేనేజ్ చేయలేదాని అడిగేసింది. ఇంకో కుర్రాడు మూడు రోజులు ఆగి ఇవ్వండంటూ ఉపదేశం ఇచ్చేశాడు. దీనికి కారణం బ్యాండ్ మేళంకు బయట పాజిటివిటిటి తక్కువగా ఉండటమే.

ఈ టీమ్ ఒక ప్రాథమిక సూత్రం మర్చిపోతోంది. రివ్యూలు క్రిటికల్ గా ఉన్నా, లేకపోయినా వీలైనంత వరకు వాస్తవిక కోణంలోనే విశ్లేషణలు చేస్తాయి. అబద్దాలు రాస్తే దొరికిపోతారు. కేవలం వాటిని చదివి ప్రేక్షకులు గుడ్డిగా థియేటర్లకు రాకుండా ఉంటారనుకోవడం అమాయకత్వం. అంతెందుకు దురంధర్ మొదటి భాగం రిలీజైనప్పుడు ఒక సుప్రసిద్ధ బాలీవుడ్ లేడీ క్రిటిక్ నెగటివ్ గా అనాలిసిస్ చేశారు. తీరా ఫలితం వచ్చేసరికి సైలెంట్ గా ఆ లింకును డిలీట్ చేసి పార్ట్ 2కి దూరం ఉండిపోయారు.

దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కంటెంట్ లో దమ్ముంటే ఎవరూ ఆపలేరు. బలగం, లిటిల్ హార్ట్స్ నిర్మాతలు ఏ రివ్యూలను మేనేజ్ చేయలేదు. సినిమాలు బాగున్నాయి కాబట్టే మీడియా, ఆడియన్స్ మద్దతు దొరికి హిట్టయ్యాయి. వాల్తేరు వీరయ్య, దేవర లాంటివి మిక్స్డ్ టాక్ తట్టుకుని గొప్ప విజయాలు సాధించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి. నిన్నటికి నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్యూర్ కి కారణం ఏంటి, తక్కువ బడ్జెట్ లో తీసిన ఫంకీ ఎందుకు రిజెక్ట్ అయ్యింది.

కాబట్టి కేవలం రివ్యూల మీద కంప్లయింట్స్ చెప్పుకోవడం కన్నా అదే స్టేజి మీద నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నట్టు ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే తప్ప నువ్వు ఇది చేయకూడదు, నువ్వు రాంగని అనలేం. అంతెందుకు బ్యాండ్ మేళం నిజంగా ఎక్స్ ట్రాడినరిగా ఉంటే ఆ మద్దతు సోషల్ మీడియాలో కనిపించి ఉండేది. కానీ ఆ రేంజ్ సౌండ్ ఎక్కడుంది. హిట్టయ్యిందని అంత నమ్మకం, లెక్కలు ఉన్నప్పుడు సక్సెస్ మీట్ లో ఈ రివ్యూల గోల ఎందుకని నెటిజెన్లు అడుగుతున్నారు. నిజమేగా.