సీనియ‌ర్ ద‌ర్శ‌కుడికి త‌త్వం బోధ‌ప‌డింది

ఎంత గొప్ప ద‌ర్శ‌కుడైనా ఏదో ఒక ద‌శ‌లో ఫామ్ కోల్పోవాల్సిందే. ఎల్ల‌కాలం టాప్ ఫామ్‌లో ఉండ‌డం సాధ్యం కాదు. తెలుగులో రాఘ‌వేంద్ర‌రావు, దాస‌రి నారాయ‌ణ‌రావు, రామ్ గోపాల్ వ‌ర్మ‌.. త‌మిళంలో భార‌తీరాజా, మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు చాలామంది ట‌చ్ కోల్పోయి పేల‌వ‌మైన సినిమాలు చేసిన వాళ్లే. ఐతే ఇలాంటి లెజెండ‌రీ డైరెక్ట‌ర్లు, స్టార్ డైరెక్ట‌ర్లు త‌మ ప‌నైపోయింద‌ని గుర్తించి సినిమాలు ఆపేయ‌డానికి చాలా టైం ప‌డుతుంటుంది.

తాము ఫామ్ కోల్పోయామ‌ని అంగీక‌రించ‌డానికి చాలామంది ద‌ర్శ‌కుల‌కు మ‌న‌సొప్ప‌దు. ఐతే టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన వి.వి.వినాయ‌క్‌కు మాత్రం కొంచెం త్వ‌ర‌గానే త‌త్వం బోధ‌ప‌డిన‌ట్లుంది. ఆయ‌న చివ‌ర‌గా తీసిన ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ పెద్ద డిజాస్ట‌ర్ అయింది. తెలుగులో కొన్నేళ్ల ముందు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఇంటిలిజెంట్ అనే మూవీ చేస్తే అది దారుణ‌మైన ఫలితాన్నందుకుంది. దీంతో వినాయ‌క్ ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నాలు ఆపేసిన‌ట్లున్నారు.

ఒక ద‌శ దాటాక సినిమాలు ఎందుకు ఆపేయాలో ఆయ‌న తాజాగా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. మ‌న ద‌గ్గ‌ర కొత్త ఐడియాలు లేన‌పుడు సైలెంట్‌గా కూర్చుని క‌బుర్లు చెప్పుకోవ‌డం బెట‌ర్. అంతే కానీ అప్పుడెప్పుడో సుమోలు ఎగ‌రేశాం అని ఇప్పుడు కూడా అవే క‌థ‌లు రాసి సినిమాలు తీస్తే జ‌నాల‌కు చిరాకేస్తుంది.

నేను ప‌ని చేసిన హీరోల ద‌గ్గ‌రికి వెళ్లి సినిమా చేద్దాం అంటే మొహ‌మాటానికి ఒప్పుకుంటారు. కానీ అలా చేయకూడ‌దు అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు వినాయ‌క్. మ‌రోవైపు వినాయక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టైన అదుర్స్‌కు సీక్వెల్ చేయాల‌ని ఉందంటూ ర‌చ‌యిత కోన వెంక‌ట్ త‌ర‌చుగా మాట్లాడుతుంటారు. దీనిపైనా వినాయ‌క్ భ‌లే స్టేట్మెంట్ ఇచ్చాడు.

నిజంగా చెప్పాలంటే అదుర్స్ సినిమా అక్క‌డితో అయిపోయిది. అందులో ఒక సీక్వెల్ తీయ‌డానికి ఏమీ మిగ‌ల‌లేదు. బ‌ల‌వంతంగా తీసినా మ‌ళ్లీ అంత గొప్ప‌గా చేయ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కం నాకు లేదు. దాన్ని అలాగే వ‌దిలేయ‌డం మంచిది అని తేల్చి చెప్పాడు వినాయ‌క్. దీంతో అదుర్స్ సీక్వెల్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది. ఈ రెండు స్టేట్మెంట్ల‌తో వినాయ‌క్ సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.