ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ అనదగ్గ థ్రిల్లర్లలో ఒకటైన దృశ్యం చిత్రానికి సెకండ్ సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. దృశ్యం-3 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని సినిమా మొదలైనపుడే అనుకున్నారు. కొన్ని వారాల ముందు వరకు ఆ డేట్కే కట్టుబడి ఉంది చిత్ర బృందం.
కానీ పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి నెలకొనడం.. చాలా చోట్ల థియేటర్లు మూతబడడంతో ఈ సినిమాను చెప్పిన డేటుకి రిలీజ్ చేసే పరిస్థితి లేకపోయింది. హీరో మోహన్ లాల్కు గల్ఫ్ కంట్రీస్లో పెద్ద మార్కెట్ ఉండడంతో ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తే చాలా ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని సినిమాను వాయిదా వేసింది చిత్ర బృందం. ఐతే ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం కొత్త డేట్ ఇచ్చేసింది మే 21న తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈమేరకు కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
కానీ మే 21న అయినా దృశ్యం-3 పక్కాగా వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇరాన్కు.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రమే ఆగింది. యుద్ధానికి మొత్తంగా తెరపడలేదు. ఇటు ఇరాన్.. అటు అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఎవరి పంతం వారిదే. ఇరాన్ పీచమణిచే వరకు ఊరుకునేది లేదన్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్ అంత తేలిగ్గా లొంగేలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి దృశ్యం-3 మే 21న కూడా పక్కాగా వస్తుందని చెప్పలేం. ఈలోపు పరిస్థితులు వేగంగా మారిపోయి, యుద్ధం పూర్తిగా ఆగిపోతే.. గల్ఫ్ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటే ఇప్పుడు ప్రకటించిన డేట్కే దృశ్యం-3ని తీసుకురావచ్చు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ లాల్ మిత్రుడు ఆంటోనీ పెరవంబూర్ ప్రొడ్యూస్ చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
