కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి ఆ రోజు ఎంట్రీ

‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత భారతీయ సినీ ప్రేక్షకులు అంతగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే ‘కేజీఎఫ్-చాప్టర్ 2’నే. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వివిధ భాషల్లో విడుదలై అన్ని చోట్లా సంచలన విజయం సాధించిందీ చిత్రం. కన్నడలో ఈ సినిమా ఆడటం ఆశ్చర్యమేమీ కాదు కానీ.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించడమే ఆశ్చర్యం.

ఇక అప్పట్నుంచి చాప్టర్-2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కరోనా లేకుంటే ఈ ఏడాది దసరాకే ‘కేజీఎఫ్-2’ సందడి చేసేది. కానీ ఆ మహమ్మారి వల్ల చిత్రీకరణ ఆలస్యమై.. వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఐతే ఇటీవలే షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో 2021 వేసవిలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.

ఇప్పటిదాకా ‘కేజీఎఫ్-2’కు సంబంధించి ఒకట్రెండు పోస్టర్లు మినహాయిస్తే ఏమీ విడుదల కాలేదు. ఐతే అతి త్వరలోనే టీజర్ రాబోతోంది. ఇందుకు ముహూర్తం కుదిరింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జనవరి 8న ‘కేజీఎఫ్-2’ టీజర్ రాబోతోంది. ఆ రోజు హీరో యశ్ పుట్టిన రోజు. ఈ ఏడాది కూడా జనవరి 8న ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా పుణ్యమా అని టీజర్ రావడానికి ఇంకో ఏడాది పట్టేసింది.

డిసెంబరు 21తో ‘కేజీఎఫ్’ విడుదలకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగానే టీజర్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ‘ఎ గ్లాన్స్ ఇన్ టు ద ఎంపైర్’ అంటూ క్యాప్షన్ జోడించి కేజీఎఫ్ సామ్రాజ్య సింహాసనంపై రాకీ (యశ్) కూర్చున్న ఫొటోతో పోస్టర్ రిలీజ్ చేశారు. మరి సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో టీజర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.